calender_icon.png 24 June, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ రైతు పోరుబాట

03-12-2024 12:00:00 AM

కేంద్రం వైఖరికి నిరసనగా అన్నదాతలు మరోసారి పోరుబాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటుగా తమ డిమాండ్ల విషయంలో కేంద్రంలోని మోదీ సర్కార్ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు మరోసారి సిద్ధమయ్యారు. నల్ల చట్టాల రద్దుకోసం గతంలో ఉద్యమించిన రైతులు కేంద్రం దిగివచ్చేదాకా ఆందోళన కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు రైతుల పలు డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించడం లేదు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు మూడేళ్ల క్రితం దాదాపు ఏడాది పాటు ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ఠ వేసి ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

అప్పట్లో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం కావడంతో మరోసారి డిసెంబర్ 6న చలో ఢిల్లీ యాత్రను చేపట్టనున్నట్లు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న భారతీయ కిసాన్ పరిషత్ ప్రకటించింది. ఇందులో భాగంగా సోమవారం యూపీకి చెందిన 20 జిల్లాల రైతులు నోయిడానుంచి ఢిల్లీకి పాదయాత్ర ప్రారంభించారు. గత ఫిబ్రవరి నుంచి పంజాబ్   హర్యానా శంభు సరిహద్దు వద్దనే తిష్ఠ వేసి ఉన్న రైతులు కూడా ఈ ర్యాలీలో చేరుతారు. పంజాబ్‌నుంచి ఢిల్లీకి పాదయాత్ర నిర్వహిస్తున్న రైతులను గత ఫిబ్రవరిలో హర్యానా ప్రభుత్వం శంభు సరిహద్దు వద్ద అడ్డుకుంది. అప్పటినుంచి వందలాది మంది రైతులు అక్కడే తిష్ఠ వేసి తమ నిరసనను కొనసాగిస్తున్నారు.

కేరళ, తమిళనాడు, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల రైతులు సైతం ఈ నెల 6న తమ రాష్ట్రాల అసెంబ్లీలకు నిరసన ర్యాలీలు నిర్వహిస్తారు. శంభు సరిహద్దునుంచి రైతులు బృందాలుగా ఢిల్లీకి పాదయాత్రగా బయలుదేరుతారు. గతంలో కూడా పంజాబ్, హర్యానాతో పాటుగా వివిధ రాష్ట్రాల  రైతులు ఇదే తరహా ఆందోళన నిర్వహించారు. ఢిల్లీ సరిహద్దుల దాకా చేరుకున్న రైతులతో కేంద్రం పలు దఫాలు చర్చలు జరిపింది. గత ఫిబ్రవరి 18న రైతులతో చివరి దఫా చర్చలు జరిపిన కేంద్రమంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్‌లు ఐదేళ్ల పాటు ధాన్యంతో పాటుగా మొక్కజొన్న, పత్తి పంటలను కనీస మద్దతు ధరతో కేంద్రం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.

అయితే ఆ హామీలను తిరస్కరించిన రైతులు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు. వివిధ కారణాల వల్ల అప్పట్లో తమ ఆందోళనకు తాత్కాలికంగా విరామం ప్రకటించిన రైతులు ఇప్పుడు మరోసారి కేంద్రంతో సుదీర్ఘ పోరాటానికి  సిద్ధమవుతున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తమ డిమాండ్లను సాధించుకోవాలనేది రైతుల ఆలోచన. సోమవారం నోయిడానుంచి ర్యాలీ ప్రారంభం సందర్భంగా ఢిల్లీనోయిడా సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధికారులు సమస్యల పరిష్కారానికి వారం గడువు కోరడంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు.

వారంలోగా సమస్యలు పరిష్కరించకపోతే  తిరిగి తమ యాత్రను ప్రారంభిస్తామని వారు అధికారులకు స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధతతో పాటు 2013 నాటి పాత భూసేకరణ చట్టాన్ని పునరుద్ధరించాలని, 2014 జనవరి 1 తర్వాత సేకరించిన భూమికి మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటుగా వ్యవసాయ రుణాల మాఫీ, రైతులు, రైతు కూలీలకు పింఛన్ ఇవ్వాలని కోరుతున్నారు.

లాగే విద్యుత్ చార్జీలు పెంచరాదని, 2021 నాటి లఖింపూర్ ఖేరీ హింస బాధితులకు న్యాయం చేయడంతో పాటుగా ఉద్యమం సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలనేది రైతుల డిమాండ్లలో ముఖ్యమైనవి. భూమి లేని రైతుల పిల్లలకు ఉపాధి, పునరావాసం కల్పించాలని, హైపవర్ కమిటీ ఆమోదించిన అంశాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని కూడా వారు కోరుతున్నారు. మరి రైతుల డిమాండ్ల పట్ల కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.