calender_icon.png 24 June, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాచవిభుడు

02-12-2024 12:00:00 AM

“.. మా తండ్రి బుద్ధక్షమానాథు పేర

నా తాత నృపకైరవాప్తుని పేర

ఘనుడు మీసరగండ కాచవిభుండు

వినుతశీలుడు పిన విఠలభూపతియు

నని జనులు మముగొని యాడంగ మేము

వినుత నూతన ద్విపద రూపమున

బ్రాకటంబుగ నాంధ్రభాషను జెప్ప

గైకొన్న యుత్తర కథ యెట్టిదనిన..” 

అంటూ తాము తమ తండ్రికి సమర్పిస్తూ ‘ఉత్తర రామాయణ’ కావ్యాన్ని రచిస్తున్నామని గోన కాచారెడ్డి, గోన విఠలరెడ్డి అనే జంటకవులు చెప్పుకున్నారు. వీరు గోన బుద్ధారెడ్డి కుమారులు. ద్విపద ఛందస్సులోనే వీరు ‘ఉత్తర రామాయణాన్ని’  రచించడం విశేషం. పైగా వాళ్లిద్దరూ తెలుగులో తొలి జంటకవులేగాక తొలి సోదరకవులుకూడా కావడం మరో ప్రత్యేకత. అప్పటి వరకూ సాహిత్య చరిత్రకారులు ‘వరాహ పురాణ’ కర్తలైన నంది మల్లయ్య, ఘంట సింగనలే తొలి జంటకవులుగా భావించారు.

తర్వాత వచ్చిన ఆరుద్ర, ఆచార్య ఎస్.వి.రామారావు వంటి పరిశోధకులు వారి కాలాలనుబట్టి పైన పేర్కొన్న సోదర కవులు ఇరువురే తొలి జంటకవులుగా గుర్తించారు. పాలనా రంగంలో ఉంటూనే సాహిత్య రంగంలోనూ తమదైన ముద్ర వేసుకున్న కవులుగా కాచవిభుడు విఠలభూపతి రాజులు సాహిత్య చరిత్రలో తమదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 

తండ్రికే అంకితం ఇచ్చిన సోదర కవులు

అన్నదమ్ములైన ఈ జంటకవులు తమ తండ్రికి అంకితమిస్తూ, తాత పేరు గోన గన్నారెడ్డిగా పేర్కొనడం సాహిత్య చరిత్రకారుల్లో కొంత గందరగోళానికి గురిచేసింది. ఈ సోదరుల తండ్రి అయిన బుద్ధారెడ్డి మొదటి బుద్ధారెడ్డియా? లేక రెండో బుద్ధారెడ్డియా? గోన గన్నారెడ్డిని పేర్కొనడం వల్ల ఇటువంటి కొన్ని సందేహాలకు ఆస్కారం కలిగింది. దానివల్ల ఈ విషయంలో కొన్ని అపోహలు చోటు చేసుకున్నాయి.

చరిత్రకారులు పలు చర్చలు చేసిన పిదప విఠలరెడ్డి కుమారుడైన బుద్ధారెడ్డిని గన్నయ దత్తు తీసుకుని ఉండవచ్చునన్న ఆచార్య రామారావు అభిప్రాయాన్ని అంగీకరిస్తే ఈ అపోహలు తొలగిపోతాయి. సాధారణంగా దత్తత తీసుకున్న తండ్రినే పేర్కొనడం లోకధర్మం కనుక ఈ గోన గన్నారెడ్డిని ‘తాత’గా చెప్పి ఉండవచ్చు. బుద్ధారెడ్డి తన రెండో కుమారునికి తండ్రి (విఠలరెడ్డి) పేరే పెట్టడం వల్ల ఈయనను పిన విఠలరెడ్డిగా చరిత్రకారులు పేర్కొన్నారు.

సరళ సుందర ధారగా కవిత్వశైలి

కాచ విభుడు, విఠలనాథుల కవితాశైలి సరళ సుందర ధారతో పాఠకులకు ఆనందాన్ని పంచుతుంది. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన కవితాశక్తి వారి రచనలో స్పష్టంగా దర్శనమిస్తుంది. వాల్మీకి మహర్షి రామచంద్రునికి సీతామాతను, లవకుశులను గురించి వివరిస్తూ

“.. పరువడి నాకందు ప్రాచేతసుండు

సంజ్ఞ విచారించి సదయుడై పలికె

ధరణీశ! ఈ సీత ధర్మనిష్ఠాత

పరమ పతివ్రత, పావనమూర్తి

జనలోక నిందకు శంకించి నీవు

తను విసర్జించిన తగవు చింతింప

వచ్చి మా యాశ్రమ వనభూమిలోన

నిచ్చలు నత్యంత నియతితో నుండి

కుశలవులను గాంచె గొడుకుల కవల

దశరథాత్మజ! వారు తనయులు నీకు..”

అని శ్రీరామచంద్రునికి వున్న సంశయాలను పోగొట్టాడు. ఈ ద్విపద వ్యాఖ్యా నిరపేక్షంగా, సామాన్య పాఠకునికి కూడా సులభంగా బోధపడే రీతిలో రచించారీ కవులు. దాదాపుగా కావ్యమంతా ఇదే శైలిలో అత్యంత సులభగ్రాహ్యంగా, పఠితల హృదయస్పర్శిగా సాగుతుంది. రచనా విధానంలో తండ్రినే అనుసరించారు ఈ తనయులిద్దరూ. తండ్రి తాను రచించిన రామాయణంలో కొన్ని అవాల్మీకమైన అంశాలకు చోటిచ్చినట్లే వీరి కృతిలోనూ మూలంలో లేని కొన్ని అంశాలు చోటు చేసుకున్నాయి. తండ్రి మార్గంలోనే సాగిన తనయులుగా చరిత్ర ప్రసిద్ధికెక్కిన జంటకవులు వీరు.

అంతే గొప్ప ద్విపద కావ్యం

వీరి తండ్రి అయిన గోన బుద్ధారెడ్డి తన తనయులపై పెట్టిన పెద్ద బాధ్యత ‘ఉత్తర రామాయణ’ రచనే. అది కూడా తాను రచించిన ద్విపద ఛందస్సును ప్రయోగించి దాన్ని గొప్ప ద్విపద కావ్యంగానే చెయ్యాలన్నది వారికి అప్పగించిన బాధ్యత. దానిని బాధ్యతాయుతంగా నెరవేర్చడంలో కాచవిభుడు, విఠలనా zథుడు ఇరువురు కూడా పూర్తిగా కృతకృత్యులైనారని అనడానికి వారి ‘ఉత్తర రామాయణమే’ ప్రమాణం.

తెలుగు సాహితీ ప్రపంచంలో గణుతికెక్కిన రామాయణాల సరసన నిలబెట్టగలిగిన రచనగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కావ్యావతారికలో వీరు తమను గురించి ‘బహు పురాణజ్ఞులు, బహు కళాన్వితులు, బహు కావ్యకోవిదులు, కవిరాజ భోజులు, ఉరుతర ప్రావీణ్యులు” అని ప్రకటించుకున్నారు. ఈ మాటలు రచన చదివిన వారందరూ అంగీకరించే సార్థక విశేషణాలు. 

“తొలి జంటకవుల ఈ రచన మీద పరిశోధనలు మాత్రం ఇంకా పూర్తి కాలేదు” అన్నారు ఆరుద్ర ఈ కావ్యాన్ని ఉద్దేశించి. ఈ మాటలను పరిగణనలోకి తీసుకుంటే, ఆ రచనలోని శబ్ద ప్రయోగ నైపుణ్యాన్ని, కవుల పురాణ విజ్ఞాన ప్రతిభను, కావ్య నిర్మాణ కళానిపుణతను, ఉరుతరమైన ప్రావీణ్యాన్ని గురించిన సమగ్రమైన పరిశోధన గ్రంథం అవసరమవుతుంది. అందులో బహుముఖీనమైన వారి ప్రతిభా వ్యుత్పత్తులు తెలుగు సాహితీ ప్రపంచానికి వెల్లడవుతాయన్నది అక్షర సత్యం. అంతేగాక, చారిత్రకంగా వారి కాల నిర్ణయం, రాజ్యపాలనా ప్రతిభ వంటి మరిన్ని విశేషాలు కూడా ప్రపంచానికి తెలుస్తాయి.

ఉత్తమ తనయులుగా సోదర కవులు

కాచవిభుడు, విఠలనాథుడు తమ తండ్రి ప్రతినను నెరవేర్చి వారి చిరకీర్తిని పెంపొందించారు. కావ్యావతారికలోనే 

“నా కూర్మి సుతులు కాబట్టి నేను 

పూనిన కథ ఎల్ల జనులు

మానుగా కొనియాడేటట్లు 

మధుర వాక్యాలతో చెప్పండి”

అని ఆదేశించినట్లు చెప్పుకున్న కవులు దాన్ని పూర్తిగా ఆచరణలో పెట్టారు. అలా, తమ రచనద్వారా తండ్రి కోరికను నెరవేర్చి ఉత్తమ తనయులుగా పేరొందారు. తండ్రి కోరికను నెరవేర్చే క్రమంలోనే మూలంలోని ఏ కథనూ విడిచిపెట్టకుండా అన్నింటినీ తమ రామాయణంలో చేర్చడం వారి పితృభక్తికి నిదర్శనం. అందువల్లే తమకన్నా పూర్వమే తెలుగునేలపై ప్రసిద్ధిగాంచిన తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’లో కనిపించని చాలా వృత్తాంతాలకు ఈ కవులు తమ కవన ప్రతిభను ప్రకటిస్తూ, రచించినట్లు ప్రామాణికంగా చెప్పవచ్చు.

తిక్కన ప్రయోగాలకు పెద్దపీట

తిక్కన రచనలో సంక్షిప్తంగా ఉన్న సందర్భాలు వీరి రచనలో కొంత విస్తృతంగా కనిపిస్తుంది. ఒక్కోసారి తిక్కన ప్రయోగించిన శబ్దాలనే చిరుమార్పులతో వీరు ప్రయోగించారు. చెలికాని అప్పారావు 1930లో ప్రచురించిన వీరి రచనను పరిష్కరించిన వారు దివాకర్ల తిరుపతిశాస్త్రి కావడం విశేషం. వారు స్వయంగా ప్రముఖ కవులు కూడా. కవిత్వమర్మం తెలిసిన మర్మజ్ఞుడు కనుక ఈ కావ్యం అప్పటి ముద్రణతోనే ఎటువంటి దుష్టపాఠాలకు చోటు లేకుండా ముద్రితమైంది.

అది ఈ జంటకవుల కవిత్వ ప్రతిభకు దర్పణంగా నిలిచింది. ఇందులోని కృత్యవతారికలో పేర్కొన్న చారిత్రకాంశాలుసహా పాలకుల కాలాన్ని, గోన గన్నారెడ్డి, బుద్ధారెడ్డి వంటి చారిత్రక వ్యక్తుల కాలాన్ని గురించితెలుసుకునే అవకాశం కలిగింది. కావ్యమేగాక అప్పటి శాసనాల ఆధారంగా కూడా సుప్రసిద్ధ చారిత్రకులైన కీ.శే. మల్లంపల్లి సోమశేఖర శర్మ వంటి పరిశోధకులు లోతులకు వెళ్లి చర్చించారు. సాహిత్య చరిత్రకారులెందరో వీరి రచనపై చర్చించే ప్రయత్నం చేశారు.

ఆంధ్ర కవి తరంగణి కర్తయైన చాగంటి శేషయ్య తమ సాహిత్య చరిత్రలో ఈ సోదర కవుల కావ్య పరామర్శ, చారిత్రక చర్చ కూడా చేయడం వీరి రచనా నిబద్ధతకు నిదర్శనం.

పాలనా వ్యవహారాలలో, శత్రువులపై యుద్ధాలలో తలమునకలైనప్పటికీ అదే సమయంలో సాహిత్యాన్ని మరువని సరస్వతీ ఉపాసకులుగా ఈ జంటకవులను అభివర్ణించాలి. వీరిరువురూ తెలుగువారు ఎల్లకాలం గుర్తుంచుకోవలసిన మహనీయులు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 


అవే ఘట్టాలు పునరావృతం

కాచవిభుడు, విఠలభూపతి రాసిన ‘ఉత్తర రామాయణం’లో పూర్వ రామాయణంలోని కొన్ని ఘట్టాలు మళ్లీ చోటు చేసుకున్నాయి. అహల్య వృత్తాంతం, వాలి వధ, సుగ్రీవ మైత్రి, హనుమంతుని పరిచయం వంటి పూర్వ రామాయణ వృత్తాంతాలతోపాటు సీతా పరిత్యాగం, లవకుశుల జన్మ వృత్తాంతం, అశ్వమేధ యాగం, సీత భూప్రవేశం, శ్రీరామ నిర్యాణం వంటి మూలంలోని సంస్కృత ఉత్తర రామాయణ వృత్తాంతాలన్నీ పొందుపరిచారు ఈ జంటకవులు.

అప్పటికే తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ లోకంలోకి వచ్చింది. అయితే, తిక్కన రచనలో వదిలి పెట్టిన అంశాలు కూడా ఈ కావ్యంలో ఈ సోదర కవులు రచించినట్లు చూడవచ్చు. కావ్యం విషాదాంతం చేయరాదన్న ఆలోచనతో తిక్కన వదిలిన శ్రీరామ నిర్యాణం, లక్ష్మణస్వామి నిర్యాణం వంటి ఘట్టాలూ ఇందులో కనిపిస్తాయి.

-గన్నమరాజు గిరిజా మనోహరబాబు

9949013448