calender_icon.png 24 June, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కుల పద్ధతి వద్దు!

03-12-2024 12:00:00 AM

తెలంగాణలో రాబోయే విద్యా సంవత్సరం (2025--26)నుంచి 10వ తరగతి విద్యార్థుల అభ్యసన స్థాయి మూల్యాంకనం కోసం ప్రస్తుతమున్న గ్రేడింగ్ పద్ధతికి స్వస్తి పలికి ‘మార్కింగ్ విధానాన్ని’ పునరుద్ధరించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. పాఠశాల విద్యలో విద్యార్థుల మూల్యాంకనం కోసం మార్కులా? గ్రేడ్‌లా? అనేది మరోసారి చర్చనీయాంశమైంది. నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అమలుపై సమీక్ష జరగాలని చాలా రోజులుగా ఉపాధ్యాయులు కోరుతున్నారు. సీసీఈ పద్ధతి కొనసాగిస్తారా? రద్దు చేస్తారా? అనే దానిపై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు. కానీ, సీసీఈలో భాగమైన పరీక్షల మార్కులను పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వుల్లో కేవలం 10వ తరగతి మూల్యాంకనం గురించే ఉంది తప్ప మిగతా తరగతుల ప్రస్తావన లేదు. 

నిజానికి గ్రేడింగ్ విధానం పూర్తిగా సఫలీకృతం కాకపోవడానికి అనేకం కారణాలు ఉన్నాయి. వాటిలో ఉపాధ్యాయ- విద్యార్థుల నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు, సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు లేకపోవడం, పర్యవేక్షణ లోపం వంటివి ఉన్నాయి. ఏ విధానమూ వంద శాతం కరెక్ట్ కాదు. లోపాలను సవరిస్తూ ముందుకు సాగాలి. ఐతే, గ్రేడింగ్ ఒకింత మెరుగైన విధానం. పిల్లల సమగ్రాభివృద్ధికి ఇది దోహదపడుతుంది. భారతదేశంలో గ్రేడింగ్ విధానాన్ని 2009లో ప్రవేశపెట్టారు.

మార్కులు విద్యార్థుల అభ్యసన స్థాయి, మూల్యాంకనానికి ఇచ్చే సంఖ్యలు మాత్రమే. విద్యార్థులు చేసే నిర్దిష్ట పనులు లేదా పరీక్షలపై తక్షణ, పరిమాణాత్మక అభిప్రాయాన్ని మార్కులు తెలియచేస్తాయి. ఇవి విద్యార్థుల పనికి ఖచ్చితమైన ఒక సంఖ్యా విలువను అందిస్తాయి. నిర్దిష్ట పనిపై విద్యార్థి పనితీరును మార్కులు ప్రతిబింబిస్తాయి. మార్కింగ్ విద్యార్థుల మధ్య ప్రత్యక్ష పోలికను సులభతరం చేస్తు, వారి మధ్య పోటీ వాతావరణాన్ని పెంచి, మానసిక ఒత్తిడిని కల్గిస్తుంది. నేర్చుకోవడం కంటే మార్కులు సాధించడంపైనే విద్యార్థులు దృష్టి పెట్టే ప్రమాదం, విద్యార్థుల మధ్య అనారోగ్య పోటీ వంటివి మార్కుల పద్ధతికి ప్రతికూలతలుగా ఉన్నాయి. గ్రేడింగ్‌లో విద్యార్థుల పనితీరునుబట్టి విస్తృత విభాగాలుగా వర్గీకరించడానికి అవకాశం ఉంటుంది. మార్కుల పద్ధతిలో ఉన్నంత ఒత్తిడి, గ్రేడింగ్ విధానంలో ఉండదు. గ్రేడింగ్ వ్యవస్థ అనేక కారణాలవల్ల ప్రశంసలు పొందింది. 

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ప్రతిభ సామాజిక స్థితిగతుల ఆధారంగా వివిధ రకాల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. గ్రేడింగ్ స్థానే మార్కుల విధానం తీసుకురావడం వల్ల పిల్లలపై ఒత్తిడి పెరుగుతుంది. సృజనాత్మకత, ప్రశ్నించే స్వభావం తగ్గే అవకాశం ఉంది. మళ్ళీ బట్టీ పట్టే విధానం రావచ్చు. మార్కుల విధానం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు అనుకూలంగా, గ్రామీణ, ప్రభుత్వ బడులకు ప్రతికూలంగా ఉంది. పోటీ పరీక్షలకు ఈ విధానం అనుకూలమే. కానీ, అకాడమిక్స్‌కు గ్రేడింగ్ విధానమే శ్రేయస్కరం. 

ప్రపంచంలోనే నాణ్యమైన విద్యను అందించే ఫిన్లాండ్, నార్వే, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, జర్మనీ ఇంగ్లాండ్ వంటి దేశాల్లో గ్రేడింగ్ విధానమే అమలవుతున్నది. భారతదేశంలోని మెజారిటీ రాష్ట్రాలు, సీబీఎస్సీ కూడా గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. కనుక, మార్కింగ్ విధానం వైపు వెళ్లడంపై ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

 పాకాల శంకర్ గౌడ్