యూరియా కోసం రైతుల అవస్థలు
13-08-2026 02:27 PM
బెజ్జంకి, ఆగస్టు 13: మండలంలోని రైతులు యూరియా, ఇతర ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు కొలిపాక రాజు తెలిపారు. ఎరువుల సరఫరాపై ముందస్తు సమాచారం లేకపోవడంతో రైతులు గంటల తరబడి కేంద్రాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఎరువులు ఏ రోజు, ఏ కేంద్రానికి వస్తాయనే సమాచారాన్ని ఒక రోజు ముందుగానే రైతులకు తెలియజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎరువుల కొరత, అధిక ధరలకు విక్రయించడం వంటి సమస్యలను నివారించేందుకు అధికారులు ఎరువుల కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని కోరారు.






