calender_icon.png 30 May, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన విత్తన చట్టంతో రైతులకు మరింత ప్రయోజనం

29-05-2025 10:22:05 PM

స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి..

పాల్గొన్న డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు..

మహబూబాబాద్ (విజయక్రాంతి): నూతన విత్తన చట్టం ద్వారా రైతులకు మేలైన విత్తనాలు, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను అమలు చేయడం ప్రభుత్వ లక్ష్యమని స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(State Seed Development Corporation) చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న నూతన విత్తన చట్టంపై ముసాయిదా సమావేశాన్ని గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం రాష్ట్రంలో 1966 లో ఏర్పాటుచేసిన విత్తన చట్టం అమలులో ఉందని, ఈ చట్టం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉందని పేర్కొన్నారు.

ఈ చట్టంలో కొన్ని లోసుగులు ఉండడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వీటిని అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విత్తన చట్టం తెచ్చేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. అందులో భాగంగా ఏడుగురు సభ్యులతో కూడిన డ్రాఫ్టింగ్ కమిటీని నియమించిందని తెలిపారు. డ్రాప్టింగ్ కమిటీ లోని సభ్యులు రాష్ట్రంలోని పలు జిల్లాలలో రైతులతో సమావేశాలు నిర్వహించి ముసాయిదా తీర్మానాన్ని జూన్ 30 లోపు ప్రభుత్వానికి అందజేయనున్నట్లు వివరించారు.

రాష్ట్రంలో సమగ్ర విత్తన చట్టం అమల్లోకి వస్తే రైతులకు నాణ్యమైన వంగడాలు అందుబాటులోకి రావడమే కాకుండా, నకిలీ విత్తనాల బాధ తప్పుతుందని, పంట నష్టపరిహారం త్వరగా అందుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ సంఘం సభ్యులు మేక సునీల్, దొంతి నరసింహ రెడ్డి, మండల వ్యవసాయాధికారి వీరాసింగ్, ప్రవీణ్ రెడ్డి, జీవన్ రెడ్డి, మల్లేష్ యాదవ్, లక్ష్మ రెడ్డి, గోవర్దన్ రెడ్డి, ముదిరెడ్డి గోపాల్ రెడ్డి, కుడితి వెంకట రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.