19-06-2025 01:18:08 AM
-ఆగస్ట్ 15 నుంచి అందుబాటులోకి
- మూడువేలతో రీచార్జి చేసుకుంటే ఏడాది లేదా 200 ట్రిప్పుల వరకు
- వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే
న్యూఢిల్లీ, జూన్ 18: వాహనదారులకు కేంద్రప్రభుత్వం తీపి కబురు అందించింది. తరచూ జాతీయ రహదారులపై ప్రయాణాలు చేసే వారి కోసం ప్రత్యేకంగా ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకొచ్చింది. ప్రయాణికులు రూ. 3వేలు చెల్లించి వార్షిక పాస్ను తీసుకుంటే ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు ఏది ముందు పూర్తయితే అప్పటి వరకు పాస్ చెల్లుబాటవనుంది. ఆగస్టు 15 2025 నుంచి ఈ పాస్లు అమల్లోకి వస్తాయని, త్వరలోనే ఈ పాస్ల జారీ చేపట్టనున్నట్టు కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
ఈ పాస్ల ద్వారా వాహనదారులు జాతీయ రహదారులపై ప్రయాణించినపుడు ఆర్థిక భారం తగ్గించుకోవడంతో పాటు, టోల్ ప్లాజాల వద్ద ఎటువంటి అంతరాయం లేకుండా ప్రయాణించొచ్చు. జీపులు, కార్లు, వ్యాన్లు ఇంకా అనేక ఇతర వాణిజ్యేతర వాహనాల కోసం ఈ పాస్ను ప్రత్యేకంగా రూపొందించినట్టు మంత్రి గడ్కరీ ప్రకటించారు.
ఎలా పొందాలంటే.. ?
ఫాస్టాగ్ వార్షిక పాస్ను రాజ్మార్గ్ యాత్ర మొబైల్ యాప్ లేదా ఎన్హెచ్ఏఐ వ్బుసైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఎన్హెచ్ఏఐ నిర్వహించే టోల్ ప్లాజాలలో మాత్రమే ఈ పాస్ పని చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లో ఈ పాస్ పని చేయదు. ఈ పాస్ కేవలం వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే వర్తించనుంది. ఈ పాస్ను పొందేందుకు ఫాస్టాగ్ తప్పనిసరి. ఏదైనా వాణిజ్యేతర వాహనానికి వార్షిక పాస్ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు.
ఈ పాస్ ద్వారా దేశంలో ఉన్న జాతీయ రహదారుల ద్వారా ఎక్కడికైనా ప్రయాణించొచ్చు. ఒక వాహనానికి తీసుకున్న వార్షిక పాస్ను మరో వాహనానికి బదిలీ చేయడం కుదరదు. వాణిజ్యేతర వాహనానికి అని చెప్పి పాస్ తీసుకుని వాణిజ్య వాహనం కొరకు ఉపయోగిస్తే మీ పాస్ వెంటనే రద్దు కానుంది. ఫాస్టాగ్ ఉన్న ప్రతి ఒక్కరూ వార్షిక పాస్ను తీసుకోవాల్సిన అవసరం లేదు.