19-06-2025 01:15:45 AM
- క్రొయేషియాలో ప్రధాని మోదీ
- సంయుక్త మీడియా సమావేశం నిర్వహించిన మోదీ
జాగ్రెబ్, జూన్ 18: ప్రజాస్వామ్యానికి ఉగ్రవాదం పెనుముప్పు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా క్రొయేషియాకు చేరుకున్న భారత ప్రధాని మోదీ ఆ దేశ రాజధాని జాగ్రెబ్లో క్రొయేషియా ప్రధాని అండ్రేజ్ ప్లెన్కోవిక్తో సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
‘సాదర ఆహ్వానం పలికినందుకు క్రొయేషియా ప్రభుత్వం, ప్రధానికి ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నా. క్రొయేషియాలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా నిలిచే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నా.గతేడాది జరిగిన ఎన్నికల్లో భారత ప్రజలు నన్ను, క్రొయేషియా ప్రజలు ఆండ్రోజ్ను మూడోసారి ఎన్నుకోవడం యాదృచ్ఛికం. రెండు దేశాలు అనేక రంగాల్లో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పరుగులు పెట్టించాలని చూస్తున్నాయి. దీర్ఘకాలిక రక్షణ రంగ సహకారానికి కూడా ప్రణాళికలు రచించాం.
ఫార్మా, వ్యవసాయం, ఐటీ, క్లీన్ టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ, పునరుత్పాదక శక్తి వనరులు మొదలైన చోట్ల ఒకరికొకరు సహకరించుకుంటాం. రక్షణ రంగంలో ఒకరికొకరం సాయం చేసుకుం టూ ముందుకు సాగుతాం.’ అని పేర్కొన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇప్పటికే సైప్రస్, కెనడాల్లో పర్యటించారు. క్రొయేషియా అధ్యక్షుడు జోరన్ మిలనోవిక్తో కూడా ప్రధాని మోదీ భేటీ కానున్నారు.