12-06-2025 12:47:19 AM
ముగ్గురు యువకుల దుర్మరణం
యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
ఇబ్రహీంపట్నం జూన్ 11: సాగర్ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసు లు వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా, అడ్డాకుల మండలం, గుడిబండ గ్రామానికి చెందిన వాస పవన్ కుమా ర్ (25), సాయి తేజ (22), రాఘవేంద్ర (25) హైదరాబాద్ లో నివాసం ఉంటూ, ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు.
కాగా మల్లేపల్లిలోని స్నేహ చికెన్ సెంటర్లో పనిచేసే తన స్నేహితుడు మంగళవారం ఏర్పాటు చేసిన విందులో మరో నలుగురు స్నేహితులతో కలిసి వెళ్ళి పాల్గొన్నారు. అనంతరం అదే రోజు అర్ధరాత్రి తిరుగు ప్రయాణమై హైదరాబాద్ కు వస్తుండగా మార్గం మధ్యలో మాల్ సమీపంలోని ఎస్సార్ పెట్రోల్ బంకు వద్దకు చేరుకొన్నారు. ఈ క్రమంలో నాగార్జునసాగర్ వైపు వెళుతున్న ట్రావెల్స్ బస్సు ఎదురుగా వచ్చి, వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీ కొట్టింది.
ఈ రోడ్డు ప్రమాదంలో పవన్ కుమార్, సాయి తేజ, రాఘవేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా, మిగితా నలుగురికి గాయాలయ్యాయి. అయితే మృతి చెందిన పవన్ కుమార్ కు వివాహమై ఒక కూతురుతో పాటు ప్రస్తుతం భార్య గర్భంతో ఉండడంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుతెలిపారు.