30 June, 2026 | 12:43 AM

రైస్ మిల్లు గోడ కూలి తండ్రి, కూతురు దుర్మరణం

23-09-2025 11:06 AM

కామారెడ్డి, (విజయక్రాంతి): ఇంట్లో నిద్రిస్తున్న వారిని గోడ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో కోటగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కోటగిరి మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న ఓ రైస్ మిల్లు  గోడ కూలి ఇద్దరు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని కోటగిరి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో రేకుల షెడ్డులో మహేష్ కుమార్, అతని భార్య, కూతురితో జీవిస్తున్నాడు.

అయితే ఆయన ఇంటి పక్కన శిథిలావస్థకు చేరిన రైస్​ మిల్లు ఉంది. సోమవారం రాత్రి భోజనం చేసి కుటుంబ సభ్యులు పడుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున రైస్​మిల్లు గోడ కూలి మహేష్​ ​కుమార్​ ఇంటిపై పడింది. ఈ ఘటనలో మహేష్​​కుమార్​, అతని కూతురు మరణించారు. ఆయన భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి.శిథిలావస్థలో ఉన్న రైస్ మిల్లును తొలగించాలని యజమానులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని కాలనీవాసులు వాపోయారు. ఇద్దరి మృతితో కోటగిరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు  ఘటన స్థలానికి చేరుకున్న వివరాలు సేకరించారు.