23-09-2025 11:06:41 AM
కామారెడ్డి, (విజయక్రాంతి): ఇంట్లో నిద్రిస్తున్న వారిని గోడ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో కోటగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కోటగిరి మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న ఓ రైస్ మిల్లు గోడ కూలి ఇద్దరు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లోని కోటగిరి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో రేకుల షెడ్డులో మహేష్ కుమార్, అతని భార్య, కూతురితో జీవిస్తున్నాడు.
అయితే ఆయన ఇంటి పక్కన శిథిలావస్థకు చేరిన రైస్ మిల్లు ఉంది. సోమవారం రాత్రి భోజనం చేసి కుటుంబ సభ్యులు పడుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున రైస్మిల్లు గోడ కూలి మహేష్ కుమార్ ఇంటిపై పడింది. ఈ ఘటనలో మహేష్కుమార్, అతని కూతురు మరణించారు. ఆయన భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి.శిథిలావస్థలో ఉన్న రైస్ మిల్లును తొలగించాలని యజమానులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని కాలనీవాసులు వాపోయారు. ఇద్దరి మృతితో కోటగిరిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న వివరాలు సేకరించారు.