25-06-2025 09:04:52 AM
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem) ఇల్లెందు మండలం ఎల్లాపురం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఒకే కుటుంబంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కరెంట్ షాక్ కొట్టి తండ్రీకొడుకు చనిపోయారు. మృతులను ఏగును నర్సయ్య(55), కుమారుడు ప్రవీణ్(30)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం... నరసయ్య పొద్దున్నే మూత్ర విసర్జన కోసం బాత్ రూంకు వెళ్తుండగా విద్యుత్ తీగకు తగిలి విద్యుత్ షాక్కు గురయ్యాడు. విద్యుత్ షాక్ కు గురైన తన తండ్రిని కాపాడుదామనుకుని కొడుకు ప్రవీణ్ ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తు ప్రవీణ్ విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా గమనించిన నరసయ్య భార్య ఎర్రమ్మ వాళ్లను కాపాడుకునేందుకు ప్రయత్నించి తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న ఎర్రమ్మను స్థానికులు ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎర్రమ్మ ప్రస్తుతం కోలుకుంటుందని వైద్యులు వెల్లడించారు. ఒకే కుటుంబంలో తండ్రీకొడుకు మృతి చెందడంతో ఎల్లాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.