కూతుళ్లను బావిలోకి తోసిన తండ్రి
- ఇద్దరు చిన్నారులు మృతి
- ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ.. భారీ బందోబస్తు ఏర్పాటు
కొత్తపల్లి, ఏప్రిల్ 3(విజయక్రాంతి): అభం శుభం తెలియని చిన్నారులను తండ్రే స్వయంగా బావిలోకి తోసి చంపేశాడు. అ నంతరం తానూ బావిలోకి దూకాడు. ఊపిరి ఆడకపోవడంతో బావి బయటకు వచ్చేశా డు. చిన్నారుల గురించి ఏమీ తెలియనట్లు ప్రవర్తించాడు. అనుమానంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్కి చెందిన కచ్చు శ్రీశైలం, మానకొండూరు మండలం లక్ష్మీపూర్కి చెందిన చుక్క రాజమల్లు కుమార్తె మౌనికతో వివాహం ఆరు సంవత్సరాల క్రితం జరిగింది.
వీరికి గాతాంశీ, గీతాన్విక కవల కూతుర్లున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. శుక్రవారం సాయంత్రం తన పిల్లలను శ్రీశైలం పొలానికి తీసుకెళ్లి, వారిని బావిలోకి తోశా డు. అనంతరం తానూ బావిలోకి దూకాడు. నీటిలో ఊపిరాడక ఈతకొడుతూ తనొక్కడే బయటికొచ్చాడు. పిల్లలు కనిపించకపోవడంతో తల్లి వెతికింది. భర్తపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
శ్రీశైలంను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో పోలీసులు విచారించగా అసలు నిజం బయటకొచ్చింది. వెంటనే పొలంలోని బావి వద్ద గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. చిన్నారుల హత్య అనే వార్త దావా నంలా వ్యాపించడంతో గ్రామంలో ఉద్రిక్తత లు తలెత్తాయి. వెంటనే స్పందించిన ఏసీపీ విజయ్ కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించి ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.




