04-07-2025 12:00:00 AM
సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఈ విషయమై గురువారం హైదరాబాద్లోని సమాచారశాఖ ఎఫ్డీసీ బోర్డు విభాగంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎఫ్డీసీ ఎండీ సీహెచ్ ప్రియాంకతో కలిసి దిల్ రాజు మాట్లాడారు.
“రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రితో పలు కీలక సమావేశాలు నిర్వహించాం. సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తున్నాం. అవసరమైతే నూతన నిబంధనల రూపకల్పన చేస్తాం. ఎఫ్డీసీ నోడల్ ఏజెన్సీగా, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైబర్ సెల్, పోలీస్ శాఖల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి, సినిమా షూటింగ్లకు ఆన్లైన్ అనుమతుల ప్రొసెస్తోపాటు వీడియో పైరసీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం.
సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందరం కలిసి ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది” అన్నారు. ఎఫ్డీసీ ఎండీ ప్రియాంక మాట్లాడుతూ.. “సినిమా జర్నలిస్టుల అక్రిడిటేషన్ అంశంపై సమీక్ష జరిపి, సాధ్యాసాధ్యాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఇండస్ట్రీ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తాం” అని చెప్పారు.