26-06-2025 12:21:54 AM
దిల్ సుఖ్ నగర్ లో విద్యార్థుల భారీ ఆందోళన
ఎల్బీనగర్, జూన్ 25 : ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ విడుదల చేయాలని, లేకుంటే ఆందోళనలు తప్పవని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్ యూ) నాయకులు డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు విడుదల చేయాలని బుధవారం దిల్ సుఖ్ నగర్ మెయిన్ రోడ్డుపై నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా పీడీఎస్ యూ జాతీయ నాయకుడు పి.మహేశ్, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలుగా వస్తున్నా నేటికీ ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ విడుదల చేయలేదన్నారు. దీఉ లక్షలాదిమంది పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు రూ, 8వేల బకాయిలు రావాల్సి ఉండగా ఇప్ౠ వరకు ఒక్క రూపాయి విడుదల చేయలేదని తెలిపారు. దీంతో డిగ్రీ కళాశాలలు మూసివేత వైపుగా వెళ్తున్నాయని, వాటి స్థానాల్లో కార్పొరేట్ కాలేజీలో వస్తున్నాయని అన్నారు. ఇప్పటికే జూనియర్ కళాశాలలో కార్పొరేట్ల మయమయ్యాయని, డిగ్రీ కాలేజీలు కూడా కార్పొరేట్ల చేతిలోకి వెళ్తాయని తెలిపారు.
ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు విడుదల చేయకపోతే విద్యార్థుల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. విద్యార్థుల బస్సు పాసు చార్జీలను రూ , 600 లకు పెంచడం సరికాదని, విద్యార్థులందరికీ ఉచితంగా బస్సు పాసులను ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎస్ యూ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, సహాయ కార్యదర్శి తీగల శ్యామ్, నాయకులు యశ్వంత్ రెడ్డి, ఝాన్సీ, భరత్, ప్రతిభ తదితరులుపాల్గొన్నారు.