మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
04-06-2024 03:52 AM
అబ్దుల్లాపూర్మెట్, జూన్ 3 : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో మే 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుంటుంబానికి సురక్ష సేవా సంఘం అండగా నిలిచింది. ఇనాంగూడలో నివసించే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన కనకప్రసాద్ గత నెల 30న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటనలో తన రెండేళ్ల కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఇంటిదిక్కు కోల్పోవడంతో ఆ నిరుపేద కుటుంబం రోడ్డున పడింది. దీంతో, ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో కనకప్రసాద్ అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న సురక్ష సేవా సంఘ సభ్యులు మృతుడు కనక ప్రసాద్ కుటుంబానికి రూ.25,000ల ఆర్థిక సహాయం అందజేశారు.






