08-06-2025 01:03:46 AM
ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్.. యాజమాన్యం తీరుపై కార్మికుల ఆందోళన
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాల భర్తీ అని ఊరిస్తూ వచ్చిన సర్కారు, ఆర్టీసీ యా జమాన్యం.. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు, ఉన్న ఉద్యోగాలకే గ్యారెంటీ లేని పరిస్థితిని తీసుకువస్తున్నారు. ఇటీవలే డిపోల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్ల నియామకం కోసం యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంతో కార్మిక సంఘాలు అగ్గిమీద గుగ్గిలం అయ్యాయి.
యాజమాన్యం తీరుపై తీవ్రంగా స్పందించాయి. ఆర్టీసీ జేఏసీ, కార్మిక సంఘాల నేతలు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి తమ నిరసన వ్యక్తంచేశారు. ఆ తర్వాత ఈ ఔట్ సోర్సింగ్ నియామక నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కార్మిక సంఘాలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపాయి.
ఔట్ సోర్సింగ్ వ్యవహారం ఇక ముగిసినట్లే అనుకునే లోపే కీలకమైన ఎంజీబీఎస్ బస్టాండులో పనిచేస్తున్న ఆర్టీసీ కంట్రోలర్లను అక్కడి నుంచి తొలగిస్తూ వారి స్థానంలో ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించేందుకు యాజమాన్యం నిర్ణయించింది.
ఈ మేరకు అక్కడ పనిచేసే కంట్రో లర్లు పది మందిని డిపోలకు పంపించాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. లేదనుకున్న, రాదనుకున్న ఔట్సోర్సింగ్ భూతం తిరిగి ఆర్టీ సీలోకి వచ్చేయడంతో కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీలో ఏం జరుగుతోంది..
ఆర్టీసీలో ఏం నడుస్తుందో అర్థం కావ డం లేదని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నా రు. ఒక రోజు ఔట్ సోర్సింగ్ నియామకాలను చేపడుతున్నట్లుగా ఉత్తర్వులు రావ డం.. తర్వాత కార్మికుల ఆందోళన వ్యక్తంచేసిన తర్వాత వాటిని ఉపసంహరించుకోవడం.. ఆ తర్వాత చాపకింద నీరులా తిరిగి ఎంజీబీఎస్లో ఔట్సోర్సింగ్ నియామకాల కోసం ఉన్న 10 మంది కంట్రోలర్లను అక్కడి నుంచి వేరే డిపోలకు పంపించే ఏర్పాటు చేయడం వంటివి చూస్తే ఆర్టీసీ ఎటు పయనిస్తుందో ఏమాత్రం అంతుపట్టడం లేదని కార్మిక సంఘాల నేతలు అంటుంన్నారు.
ఇప్పటికే నగరానికి 2800 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. కేంద్రం నిబంధనల మేరకు వీటికి కండక్టర్ మినహా ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్లు, ఇతర సిబ్బందితో సంబంధమే లేదు. అయితే కార్మికుల విజ్ఞప్తి మేరకు ఈ బస్సులకు ఆర్టీసీ డ్రైవర్లు పనిచేసేలా అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రైవేటు కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులకు ఏ రూపంలో ఆర్టీసీ డ్రైవర్లను కొనసాగిస్తారనేది అంతుచిక్కని ప్రశ్నగా కనిపిస్తోంది.
ఎందుకంటే ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం స్వంతంగా కొనే పరిస్థితి లేదు. పోనీ ప్రభుత్వం కొంటుందా అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆ పరిస్థితి కూడా ఏ మాత్రం కనిపించడం లేదు. అలాంటప్పుడు ప్రైవేటు సంస్థలకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులకు డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బందిని ఎవరిని నియమించాలనేది వారి స్వంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందే తప్ప, కేంద్రానికి లేఖలు రాసినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం కనిపించే అవకాశం లేదని రవాణా రంగ నిపుణులు చెబుతున్నా రు.
ఆర్టీసీ కార్మికులను తాత్కాలికంగా చల్లబర్చేందుకు ప్రభుత్వం లేఖలు రాస్తామని చెప్ప డం తప్పించి ఆ లేఖల వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండబోదని నిపుణులు అంటున్నా రు. ఒకవేళ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తే నగరంలో సుమారు 7వేల మందికి పైగా కార్మికులను ఇతర డిపోలకు తరలించా ల్సి వస్తుందని అప్పుడు ఇక కొత్త నియామకాల మాటెక్కడ ఉంటుందని కార్మికులు వాపోతున్నారు.
రిటైర్డ్, కన్సల్టెన్సీల నుంచి వచ్చిన వాళ్లకే..
బస్ భవన్లో రిటైర్డ్ అయిన వాళ్లు నేటికీ పనిచేస్తున్నారని, వారికి గతంలో కంటే అధిక వేతనాలు ఇస్తున్నారని దానితో సంస్థలో పదోన్నతులు లేకుండా పోయాయని యూనియన్ నేతలు అంటున్నారు. ఇక కన్సెల్టెన్సీ నియామకాల పేరిట లక్షల్లో వేతనాలిచ్చి తీసుకున్న వారికి కీలకమైన బాధ్యతలు ఇస్తున్నారని రెగ్యులర్ ఉద్యోగులను దూరం పెడుతున్నారని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.
3వేల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లుగా 3వేల సార్లు చెప్పారు తప్పించి కనీసం ఒక్కటంటే ఒక్క నియామకం చేపట్టలేదని.. పైపెచ్చు ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నారని అంటున్నారు. ఔట్ సోర్సింగ్ నియామక ప్రక్రియను ఆపని పక్షంలో పెద్దఎత్తున పోరాటానికి దిగుతామని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.
యూనియన్లు లేకనే..
ఆర్టీసీ ట్రేడ్ యూనియన్లకు గుర్తింపు లేకుండా చేసిన గత ప్రభుత్వం తీరు వల్లే నేడు తమ పరిస్థితి దయనీయంగా మారిందని ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. ట్రేడ్ యూనియన్ లేనందున యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని.. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.
ఇప్పటికే ఆర్టీసీ కార్గో, ఆర్టీసీ పెట్రోల్ బంకులు, బస్ పాస్ కౌంటర్స్, సెక్యూరిటీని క్రమంగా ఔట్ సోర్సింగ్ దిశగా తీసుకువెళ్లిన యాజమాన్యం ఇప్పుడు కంట్రోలర్లను కూడా ఔట్ సోర్సింగ్ చేయడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కీలకమైన ఎంజీబీఎస్లో ప్రైవేటు వ్యక్తులు బస్సులను ఆపరేట్ చేయడం గతంలో ఎప్పుడూ చూడలేదని అంటున్నారు.
విద్యుత్ బస్సులు వస్తే ఎంతో నష్టం..
విద్యుత్ బస్సులు ప్రైవే టు రంగం ద్వారా ప్రవేశపెడితే 7500 మంది ఉద్యో గాలకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ అంశంపై రాష్ట్రప్రభుత్వానికి మేం విజ్ఞప్తి చేయగా.. కేంద్రానికి లేఖ రాసింది. పీఎం డ్రైవ్ పథకంలో మార్పులు చేసి విద్యుత్ బస్సు ల సబ్సిడీని ఆర్టీసీకి అందించేలా నిబంధనలను మార్చాలని ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో కోరింది.
ప్రైవేటు విద్యుత్ బస్సులు వస్తే డ్రైవర్లు, గ్యారేజీలో శ్రామిక్, హెల్పర్లు, మెకానిక్ ఉద్యోగాలకు కోత పడుతుంది. స్టోర్స్, డీజిల్ పంపులను మూసేస్తారు. టైర్ మెకానిక్, కోచ్ బిల్డర్, హెల్పర్, తదితర గ్యారేజీ సిబ్బంది ఉద్యోగాలుండవు. అందుకే ఆర్టీసీకి ఇబ్బందిగా ఉన్న విద్యుత్ బస్సుల పథకంలో మార్పుల కోసం ఉద్యమానికి కార్మికులు సిద్ధంగా ఉండాలి. అవసరమైతే ఢిల్లీకి పోయి నిరసన కార్యక్రమం చేపడతాం.
కె. రాజిరెడ్డి. ఆర్టీసీ ఎస్డబ్ల్యూయూ
(ఐఎన్టీయూసీ) రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి