11 May, 2026 | 11:17 AM

మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డుప్రమాదం: స్పోర్ట్స్ బైక్, కారు ఢీకొని ఐదుగురు మృతి

11-05-2026 10:10 AM

హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైపాస్ రోడ్డులోని పాలకొండ గ్రామం వద్ద ఆదివారం రాత్రి ఒక స్పోర్ట్స్ బైక్, కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు, కారులో ఉన్న మరో ముగ్గురు మరణించారు. ప్రమాదంలో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన అమీర్ (18 నెలలు), ఉజేఫా (8), గౌసియా (2) ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి వస్తున్న ఇద్దరు బైక్ రైడర్లు మృతి చెందగా, మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. 

ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్పోర్ట్స్ బైక్ 140 స్పీడులో కారును ఢీకొట్టినట్లు సమాచారం. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బైక్ రేసింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ బైపాస్ రహదారి బైకర్లు రేసింగ్‌లో పాల్గొనడానికి ఒక కేంద్రంగా మారిందని, దీనివల్ల ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని స్థానికులు తెలిపారు. ఈ  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.