ఏరాజుపల్లి వీఐడీసీ సభ్యులు ఎస్సై రాజశేఖర్కు ఘన సన్మానం
బోధన్, ఆగస్టు16(విజయక్రాంతి): బోధన్ మండలంలోని ఏరాజుపల్లి గ్రామ వీఐడీసీ సభ్యులు బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై రాజశేఖర్ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని అభినందిస్తూ వీఐడీసీ సభ్యులు ఎస్సై రాజశేఖర్కు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు.
ఈ సందర్భంగా గ్రామ వీఐడీసీ అధ్యక్షులు నరసింహారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు పోలీసుల సహకారం ఎంతో అవసరమని అన్నారు. గ్రామ ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా పోలీసుల దృష్టికి తీసుకువచ్చి చట్టపరంగా పరిష్కరించుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
గ్రామ సర్పంచ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు–పోలీసుల మధ్య సత్సంబంధాలు కొనసాగితే గ్రామంలో శాంతిభద్రతలు మరింత మెరుగుపడతాయని అన్నారు. ప్రజల సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంలో వీఐడీసీ సభ్యులు ముందుండాలని సూచించారు.
ఎస్సై రాజశేఖర్ను సన్మానించిన కార్యక్రమంలో వీఐడీసీ మెంబర్లు తెనుగు శ్రీనివాస్, గంగా రెడ్డి, వెంకటేష్, రాము, గాలబోయి రఘు, వరుణ్ రెడ్డి, జగన్తో పాటు గ్రామ కమిటీకి చెందిన సుమారు 32 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, శాంతిభద్రతలు, ప్రజా సమస్యలపై పరస్పరం చర్చించారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా పోలీసులకు తమ వంతు సహకారం అందిస్తామని వీఐడీసీ సభ్యులు తెలిపారు.






