12 May, 2026 | 2:58 AM

బైక్ రేసింగ్‌కు ఐదుగురి బలి

12-05-2026 01:39 AM
  1. కారును వేగంగా ఢీకొన్న బైక్
  2. కారులో ఉన్న ముగ్గురితో పాటు బైక్‌పై ఉన్న ఇద్దరు దుర్మరణం
  3. మహబూబ్‌నగర్ జిల్లా పాలకొండ వద్ద ఘటన

మహబూబ్‌నగర్, మే 11 (విజయక్రాంతి): బైక్ రేసింగ్ సరదా ఐదుగురి ప్రాణాలను బలిగొన్నది. సంఘటన చోటు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ దగ్గర చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన బైకర్ యాకుబ్ అఫ్జల్(25)తో పాటు మరో వ్యక్తి సోమవారం బైక్‌పై రేసింగ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా పాలకొండ వైపు అతి వేగంగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ కుటుంబం పెళ్లికి వెళ్లి కారులో తిరిగి ఇంటికి వెళ్తున్నారు.

ఆ కారును బైక్ అతివేగంతో బలంగా ఢీకొట్టడంతో కారులో ఉన్న అర్షియ బేగం(30), ఆమె కూతురు ఉజేప(7), కొడుకు అమర్(2)తో పాటు బైక్‌పై ఉన్న ఇద్దరూ మృతిచెందారు. మృతదేహాలను జిల్లా జనరల్ హాస్పిటల్ పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల కుటుంబ సభ్యులను నగర డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు.