calender_icon.png 22 November, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

5 లక్షల కోట్ల స్కాం

22-11-2025 01:21:06 AM

హెచ్‌ఐఎల్‌టీపీ పేరిట దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి సీఎం కుట్ర

పాలసీని కాలరాసి లక్షల కోట్ల విలువైన భూమిని అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పుతున్నరు 

  1. ప్రభుత్వం వెంటనే ఈ పాలసీని రద్దు చేయాలి 
  2. కేవలం 30% ఎస్‌ఆర్‌ఓ రేట్లకు రెగ్యులరైజ్ చేయడం అవినీతికి నిదర్శనం 
  3. ఇది కేవలం రేవంత్‌రెడ్డి అన్నదమ్ములు, అనుచరుల కోసమే తీసుకువచ్చిన పాలసీ 
  4. ఇందులో పాలుపంచుకుంటే వాటి రద్దు తప్పదు 
  5. పారిశ్రామికవేత్తలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక

హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ(హెచ్‌ఐఎల్‌టీపీ) పేరిట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ. 5 లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణానికి పాల్పడాలని చూస్తున్నట్టు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిని భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణంగా అభివర్ణించారు.

ఈ విధానం సీఎంకు సన్నిహితంగా ఉండే రాజకీయ మధ్యవర్తులు, బంధువులు, రియల్ ఎస్టేట్ గ్రూపులకు లబ్ధి చేకూర్చేందుకే రూపొందించారని ధ్వజమెత్తారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్‌ఐఎల్‌టీపీ వాస్తవానికి వేలాది ఎకరాల పారిశ్రామిక భూములను అత్యంత తక్కువ ధరకు బహుళ- ఉపయోగ విలువైన రియల్ ఎస్టేట్‌గా మార్చడానికేనని పేర్కొన్నారు.

ఇది కేవలం పాలసీ కాదు.. రూ. 5 లక్షల కోట్ల స్కామ్ కోసం రూపొందించిన బ్లూప్రింట్ అని ఆరోపించారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. బాలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, అజామాబాద్‌తో సహా హైదరాబాద్‌లోని కీలకమైన పారిశ్రామిక క్లస్టర్‌లలో ఉన్న సుమారు 9,292 ఎకరాల విలువైన భూమిని క్రమబద్ధీకరించడానికి ఈ పాలసీ ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.

ఈ భూముల మార్కె ట్ విలువ ప్రస్తుతం ఎకరాకు రూ. 40 నుం చి 50 కోట్ల వరకు ఉందని, దీని మొత్తం విలువ రూ. 4 లక్షల కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు. వాటిని ఆయన అనుయాయులకు, వందిమాగధులకు, తమ్ముళ్లకు, బంధువులకు, చుట్టూ ఉండే బ్రోకర్లకు ఒప్పందం కుదిర్చి అతిపెద్ద కుంభకోణానికి రేవంత్‌రెడ్డి సర్కార్ తెరలేపిందని తెలిపారు. హైదరాబాద్‌లోని విలువైన భూములు ఎక్కడ ఉన్నా యో తెలుసుకుని రేవంత్‌రెడ్డి ముఠా అక్కడ వాలిపోతున్నారని ఆరోపించారు.

ఇటీవల మంత్రి కొండా సురేఖ కూతురు వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో పారిశ్రామికాభివృద్ధి కోసం అడ్డికి పావుశేరు చొప్పున భూములను కేటాయించగా, ప్రస్తు తం ఆ భూముల విలువ పెరిగిందని, వాటి ని ఏటీఎంగా వాడుకోవాలని రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

రూ. 50 వేల కోట్ల కోసమే.. 

ముఖ్యమంత్రి పాలన కంటే, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ముందు మూసీ నదీ తీరంలోని భూములు, తర్వాత మెట్రో రైలు భూములు, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములు, ఇప్పుడు 9,292 ఎకరాల పారిశ్రామిక భూములపై దృష్టి సారించిన రేవంత్‌రెడ్డి కేవలం రియల్ ఎస్టేట్ మాత్రమే తమ ప్రాధాన్యత అని నిరూపించుకుంటున్నారని విమర్శించారు.

ఆయన చుట్టూ ఉన్న భూ డీలర్లు, ఆయన సోదరులు, సన్నిహితులు ఇప్పటికే ఈ భూముల కోసం ఒప్పందాలు చేసుకున్నారు. అందుకే పాలసీని తొందరపె డుతు న్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు, స్మశానవాటికలకు కూడా స్థలంలేని హైదరాబాద్‌లో, ప్రభుత్వం ప్రజల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోందని స్పష్టంచేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లేదా స్మశానవాటికలకు కూడా భూమి దొరకని నగరంలో, రేవంత్ ప్రభుత్వ ఆస్తులను పెద్దలకు, గద్దలకు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనుకుంటున్నారని కేటీఆర్ అన్నారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని, ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలని లేదా ముంబై మాదిరిగా బహిరంగ వేలం వేయాలని అన్నారు. దానికి బదులుగా వారు రూ. 5 లక్షల కోట్లు దోచుకోవాలని, కనీసం రూ. 50,000 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జేబులో వేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

డెవలపర్‌లకు హెచ్చరిక.. 

హెచ్‌ఐఎల్‌టీపీ కింద డీల్స్ కుదుర్చుకునే వారికి కేటీఆర్ నేరుగా హెచ్చరిక జారీచేశారు. ఈ పాలసీ కింద భూమి కొనుగోలు చేసే పారిశ్రామికవేత్తలు భవిష్యత్తులో తీవ్రమైన న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొం టారని, ఈ లావాదేవీలు నిలబడవని, ఆ భూమిని తిరిగి తీసుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వ చ్చిన తర్వాత క్రమబద్ధీకరణను రద్దుచేసి, తగిన చర్యలు ప్రారంభిస్తుందన్నారు. తాము పూర్తి స్థాయి విచారణ జరుపుతామని, ఈ కుంభకోణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ స్కామ్‌లో పాల్గొనే ఎవరినీ వదిలిపెట్టబోమని, న్యాయ పోరాటం కూడా చేస్తామని స్పష్టం చేశారు.

లాభం చేకూర్చేందుకే.. 

కాలుష్య కారక పరిశ్రమలను నగరం మధ్య నుంచి తరలించాలని 2013లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలోనూ పరిశ్రమలను ఓఆర్‌ఆర్ వెలుపలికి తరలించేందుకు ప్రయత్నించామని, ఇందులో భాగంగా 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీని ఏర్పాటు చేయాలనుకున్నామని వివరించారు. ప్రస్తుతం దానికి కూడా ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టి సీఎం రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనిచేస్తున్నారని విమర్శించారు.

తమ ప్రభుత్వ హయాంలో అజామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్ధీకరించినప్పుడు ఎస్‌ఆర్‌ఓ రేట్ల కంటే 100 శాతం నుంచి 200 శాతం అధికంగా వసూలుచేయాలని ఒక చట్టం చేశామన్నారు. కానీ ఆ భూములను రేవంత్‌రెడ్డి కేవలం ప్రభుత్వ విలువలో 30 శాతం విలువకే అప్పగించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నఫలంగా లూట్ చేయాలనుకునే ఉద్దేశంతో కేవలం దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోనే అనుమతి ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు.

ఎందుకు? ఎవరికి లాభం చేకూర్చడానికి? అని ప్రశ్నించారు. మార్కెట్ ధరలు, ఎస్‌ఆర్‌ఓ విలువ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన వాదించారు. కనీసం ఎస్‌ఆర్‌ఓను కూడా పూర్తిగా వసూలు చేయడం లేదని, కేవలం 30 శాతమే మాత్రమే తీసుకోవడం ద్వారా మిగిలిన లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్తాయని ఆరోపించారు.

ప్రస్తుతం నగరంలో ఒక ముఠా తిరుగుతున్నదని, హైదరాబాద్‌లోని పారిశ్రామిక భూములను రేవంత్‌రెడ్డి వ్యాపార భాగస్వాములు, కుటుంబ సభ్యులైన ఏవీ రెడ్డి, కొండల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, కృష్ణారెడ్డి అగ్రిమెంట్ చేసిపెట్టుకున్నారని స్పష్టం చేశారు. అయితే ఇందులో ప్రభుత్వానికి 30 శాతం వస్తే అదనంగా ఆర్ ఆర్ ట్యాక్స్ కింద రేవంత్‌రెడ్డికో, కాంగ్రెస్ పార్టీకో కప్పం కట్టాల్సిందేనని ఆరోపించారు. ఈ రకంగా నాలుగైదు లక్షల కోట్ల విలువైన భూములకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం టెండర్ పెట్టిందన్నారు. 

తొందరెందుకు.. 

ఉద్యోగాల కల్పన, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి చారిత్రకంగా పారిశ్రామిక భూములను చాలా తక్కువ ధరలకు లేదా ఉచితంగా కేటాయించారని కేటీఆర్ చెప్పారు. చాలా సందర్భాల్లో ప్రజల నుంచి భూములను సేకరించి పారిశ్రామికవేత్తలకు అనేక రైతులతో ఇచ్చిన ఈ భూములను ప్రైవేట్ వ్యక్తుల కోసం రెగ్యులరైజ్ చేస్తామంటే కుదరదన్నారు. ఉత్పత్తిని పెంచడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి గత ప్రభుత్వాలు రాయితీ ధరలకే పారిశ్రామిక భూమిని ఇచ్చాయని, కానీ ఇప్పుడు అవే భూములను ప్రైవేట్ వ్యక్తుల లాభాల కోసం క్రమబద్ధీకరిస్తున్నారని ఆరోపించారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక మంది భూ యజమానులు, బ్రోకర్లు  అత్యంత తక్కువ ధరలకు  క్రమబద్ధీకరణ కోసం తనను సంప్రదించారని, అయితే తాము ఆ ప్రతిపాదనలను తిరస్కరించామని వెల్లడించారు. ఈ పాలసీని ప్రభుత్వం ఆమోదించే వేగం  అత్యంత అనుమానాస్పదంగా  ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.

7 రోజుల్లో దరఖాస్తులు, 7 రోజుల్లో ఆమోదాలు, 45 రోజుల్లో పూర్తి క్రమబద్ధీకరణ చేయమని చెప్పడంపై అనుమానం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల విలువైన భూముల అంశంలో ఎందుకీ తొందర? ఎందుకీ వేగవంతమైన ప్రక్రియ? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సోదరులు, అనుచరులు, మధ్యవర్తులు ఇప్పటికే ఈ భూముల కోసం ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. 

వెంటనే పాలసీని ఉపసంహరించుకోవాలి 

ఈ పాలసీని వెంటనే ఉపసంహరించుకోవాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీసం, ప్రభుత్వం 50 శాతం భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని, మిగిలిన 50 శాతం క్రమబద్ధీకరించాలన్నారు. కానీ కాంగ్రెస్ 100 శాతం భూమిని చౌక ధరలకు క్రమబద్ధీకరించాలని చూస్తోందని ఆ రోపించారు. ముంబై లాంటి మెట్రో నగరాల్లో ఇలాంటి భూములను వే లం వేసి ప్రభుత్వం ప్రజల ఆస్తిని ప్ర భుత్వ ఖజానాకు చేరుస్తుంటే, ఇక్కడ మాత్రం అప్పనంగా ప్రైవేట్ వ్యక్తుల లబ్ధి కోసం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ఈ అంశంపై స్పందించాలని కేటీఆర్ బీజేపీకి సవా ల్ విసిరారు. బీజేపీకి నిజంగా చిత్తశు ద్ధి ఉంటే దీనిని వ్యతిరేకించాలన్నారు. మౌనంగా ఉంటే కాంగ్రెస్, బీజేపీ కలసిపోయాయని అర్థం అని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాంగ్రెస్ రూ. 5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని దోచుకోవడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. ఇది అభివృద్ధి కాదు, ఇది పగటిపూట దోపిడీ అని కేటీఆర్ అన్నారు. 

నన్ను అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వం చేయదు!  

ఈ-కార్ రేసింగ్ కేసులో ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ఆమోదం తెలపడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందిస్తూ, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని చెప్పారు. ‘ఆ కేసులో ఏమీ లేదని వారికీ తెలుసు. నన్ను అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వం చేయదు. ఈ రేసింగ్ కేసులో తప్పు చేయలేదని ఇప్పటికే వందసార్లు చెప్పా.. కావాలంటే లై డిటెక్టర్ టెస్ట్‌కూ సిద్ధం. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి జాయింట్ వెంచర్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.

ఇంత అక్రమ బంధం దేశంలో ఎక్కడా ఉండదు. రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇప్పుడు జరుగుతున్న అవినీతి అక్రమాలను వెలికితీస్తాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే పరువు పోతుందని రాజీనామాకు అవకాశం ఇస్తున్నారు. దానం నాగేందర్‌తో రాజీనామా చేయిస్తారు. దానంతో రాజీనామా చేయిస్తామని కాంగ్రెస్ నాయకులు మా వాళ్లతోనే అంటున్నారు. సాంకేతిక సాకులతో కడియం శ్రీహరిని కాపాడే అవకాశం ఉందేమోనని చూస్తున్నారు’ అని కేటీఆర్ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా అన్నారు.