గొలుసుకట్టు చెరువులతో వరదలకు కట్టడి
భూగర్భ జలాల పెరుగుదలకూ దోహదమన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్/సికింద్రాబాద్, మే 15:(విజయక్రాంతి): గొలుసుకట్టు చెరువులకు పెట్టింది పేరు మన హైదరాబాద్ అని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. ఈ మహానగరంలో మొత్తం 1384 చెరువులుంటే ఇందులో 625 చెరువుల జాడ కనిపించడం లేదన్నారు. ఉన్న 759 చెరువులు కూడా ఆక్రమణలకు గురై కనుమరు గయ్యే ప్రమాదంలో ఉన్నాయని చెప్పారు. ఉన్న చెరువులను పరిరక్షించడమే కాకుండా కనుమరుగైన చెరువుల జాడ తెలుసుకుని అన్నిటినీ పునరుద్ధరించడమే హైడ్రా లక్ష్యమన్నారు.
గొలుసుకట్టు చెరువుల లింకును తిరిగి అనుసంధానించి వరదల కట్టడికి హైడ్రా కృషి చేస్తోందని వివరించారు. చెరువుల చెంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆ దిశగా హైడ్రా పని చేస్తోందని రంగనాథ్ చెప్పారు. శుక్రవారం నగరంలోని ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భూగర్భ జలాలస్థాయి పెంచడంపై దృష్టి సారిస్తున్నట్లు వివరించారు.






