28-09-2025 01:22:14 AM
-రూ.5లక్షల కోట్ల దోపిడీ కోసమే హైదరాబాద్ను ముంచిండు
-కొడంగల్లో రేవంత్కు తొడపాశం పెడితే ఢిల్లీ దద్దరిల్లుతుంది
-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం
-కొడంగల్కు చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరిక
హైదరాబాద్, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): రూ.1.50 లక్షల కోట్లను దోచేందుకే హైదరాబాద్ ప్రజలను సీఎం రేవంత్రెడ్డి మూసీ వరదలో ముంచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ కిరాతక మనస్తత్వం తోనే వేలాది ప్రజల ఇండ్లు, ఆస్తులు మూసీ వరద లో చిక్కుకున్నాయని మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు శనివారం బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్కు వరద ము ప్పును తగ్గించేందుకు వందేళ్ల కిందట నిజాం ప్రభుత్వం నిర్మించిన ఉస్మాన్సాగర్, గండిపేట చెరువులను వాతావరణ శాఖ హెచ్చరిక లు రాగానే ఖాళీ చేసి మూసీ వరద నీటిని నిల్వ చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. కానీ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో దోపిడీకి పాల్పడేందుకు ఆ ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలన్న దురుద్దేశంతో రేవం త్రెడ్డి ఆ చెరువులను ఖాళీ చేయించలేదని ఆరోపించారు.
అందుకే చరిత్రలో తొలిసారి గా ఇమ్లీబన్ బస్టాండ్ను వరద ముంచెత్తిందన్నారు. కొడంగల్లో వస్తు న్న వ్యతిరేకతను గుర్తించిన రేవంత్ రెడ్డి, రాబోయే ఎన్నికల్లో వేరే నియోజకవర్గం నుం చి పోటీ చేయడం ఖాయమన్నారు. రాష్ట్రానికి సీఎం రేవంత్ అయినా కొడంగల్కు మాత్రం ఆయన సోదరుడు తిరుపతి రెడ్డియే ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. కనీసం కౌన్సిలర్ కూడా కాని తిరుపతిరెడ్డికి కలెక్టర్లు, ఎస్పీలు వంగి దండాలు పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. కేసీఆర్ కట్టించిన భవనాలు, ఫ్లు ఓవ ర్లు, బ్రిడ్జిలకు రిబ్బన్ కట్ చేయడానికి రేవంత్ రెడ్డి, తిరుపతిరెడ్డి జేబులో కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నారని, అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కొడంగల్ ఏమైనా రేవంత్ జాగీరా..
కొడంగల్ ప్రజలు భిక్షమేస్తే ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్రెడ్డి, ఆ కొడంగల్ గురించి అసెంబ్లీలో అడ్డదిడ్డంగా మాట్లాడారని మండిపడ్డారు. అల్లుడి ఫ్యాక్టరీ కోసం భూములు గుంజుకొని రైతుల పొట్టగొడుతుంటే చూస్తూ ఊరుకోబోమని, ‘కొడంగల్ ఏమైనా రేవంత్ జాగీరా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు. రాహుల్, రేవం త్, భట్టి సంతకంతో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉన్నదో చెబుతూ తాము ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ను తయారు చేశామన్నారు.
స్థానిక ఎన్నికల్లో ప్రచారం కోసం ఇంటింటికీ వచ్చే కాంగ్రెస్ నేతలకు ఈ కార్డును చూపించి, బాకీ కట్టిన తరువాతే ఓటు అడగాలని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ఉన్న ప్పుడు నాట్లు వేసేటప్పుడు రైతుబంధు పైసలు పడేవని, రేవంత్ రెడ్డి మాత్రం ఓట్లు వేసేటప్పుడు మాత్రమే రైతుబంధు పైసలు వేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్కు పేరు వస్తుందనే ఉద్దేశంతో 90 శాతం పూర్తయిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి పక్కన పెట్టారని ఆరోపించారు. కమీషన్ల కోసం రూ.4,500 కోట్లతో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మొదలు పెట్టారని విమర్శించారు.
అయితే ఆల్మట్టి ఎత్తు పెంచితే జూరాల ప్రాజెక్టుకు చుక్క నీళ్లు కూడా రావని, కేవలం కమీషన్ల కోసమే ఈ పనులను మెగా కృష్ణారెడ్డికి, బాంబులేటి శ్రీనివాస్రెడ్డికి అప్పజెప్పారని ఆరోపించారు. అయితే రేవంత్ రెడ్డి దోపిడీ కోర్టుకు అర్థమై, ఆ పనులకు స్టే ఇచ్చిందన్నారు. కాంగ్రెస్, రేవంత్రెడ్డికి బుద్ధి చెప్పడానికి మూడేళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేదని, రాబో యే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను బంపర్ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కొడంగల్లో స్విచ్ బంద్ చేస్తే ఢిల్లీలో లైట్లు బంద్ అవుతాయని.. కొడంగల్లో రేవంత్రెడ్డికి తొడపాశం పెడితే ఢిల్లీ దద్దరిల్లుతుం దన్నారు. వచ్చే ఎన్నికల్లో నరేందర్రెడ్డిని గెలిపిస్తే ప్రమోషన్ ఇస్తామని, కేసీఆర్ను మరో సారి సీఎంను చేసే జైత్రయాత్ర కొడంగల్ నుంచే మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు.