12-06-2025 12:50:38 AM
గుంతల రోడ్లు, దుమ్ముతో వాహనదారుల ఇక్కట్లు
మేడ్చల్ అర్బన్, జూన్ 11: జాతీయ రహదారి 44పై కొనసాగుతున్న ఫ్లైఓవర్ పనులతో స్థానిక మేడ్చల్ ప్రజలు, హైవేపై ప్రయాణించే వాహనదారులు నిత్యం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. బోయిన్పల్లి నుండి కండ్ల కోయ వరకు రహదారి విస్తీర్ణ, ఫ్లైఓవర్ పనులు చకచకా కొనసాగుతుండగా మేడ్చల్ పట్టణంలో మాత్రం ఫ్లైఓవర్ పనులు నత్త నడకలా జరుగుతున్నాయి.
దీంతో స్థానిక పట్టణ ప్రజలేగాక రహదారిపై ప్రయాణించే వాహనదారులు సైతం గుంతల రోడ్లు, దుమ్ము, ట్రాఫిక్ జామ్ తో అస్తవ్యస్తలు పడుతున్నారు. ఇదిలా ఉండగా పిల్లర్ల నిర్మాణం, రోడ్డు ఇరువైపులా మట్టి పోసి తారు రోడ్డు వేయకుండానే వదిలేయడంతో పలువురు వాహనదారులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ వెలుగు చూసాయి. దీనంతటికీ కారణం ఫ్లై ఓవర్ పనుల కాంట్రాక్టర్ నిర్లక్ష్యమేనని పలువురు ఆరోపిస్తున్నారు.
సదరు కాంట్రాక్టర్ పై పోలీసులు సుమోటోగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఫ్లై ఓవర్ పనుల కారణంగా రహదారిపై ఏర్పడిన భారీ గుంతలకు మరమ్మతులు చేయాలని పలువురు స్థానికులు కోరుతున్నారు.
వర్షాకాలం సమీపిస్తుండడంతో పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు అంటున్నారు. వేసవికాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే వర్షాకాలంలో పరిస్థితి మరే విధంగా ఉంటుందొనని వాహనదారులు,స్థానికులు ఆందోళన చెందుతున్నారు.