23 May, 2026 | 1:10 AM

అదనపు ఆదాయంపై దృష్టి

23-05-2026 12:27 AM
  1. లీకేజీలను అరికట్టి, బడ్జెట్ లక్ష్యాలను అందుకోవాలి
  2. రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  3. హాజరైన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు, ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన ‘రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ’ (ఆదాయ వనరుల సమీకరణ మంత్రి వర్గ ఉపసంఘం) ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

ఈ కీలక భేటీకి కమిటీ సభ్యులైన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అదనపు ఆదాయ మార్గాల అన్వేషణ, వివిధ శాఖల ప్రగతిపై మంత్రుల బృందం అధికారులతో కలిసి లోతుగా సమీక్షించింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ... 2026- ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించనున్న బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా నిధుల సమీకరణ జరగాలని స్పష్టం చేశారు.

బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు లీకేజీలను పూర్తిగా అరికట్టాలని, అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆదాయ వనరులను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ఖజానాకు గండి కొ డుతున్న అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర క్యాబినెట్ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు.. మే 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సవరించిన (పెంచిన) భూముల మార్కెట్ విలువలు (రిజిస్ట్రేషన్ ధరలు) అమలులోకి రానున్నాయని అధికారులు  మంత్రుల బృందా నికి వివరించారు.

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, పరిశ్రమలు, రిజిస్ట్రేషన్లు, మైనింగ్, రెవెన్యూ, రవాణా తదితర కీలక శాఖలలో ప్రస్తుత వనరుల పురోగతి, రాబోయే రోజుల్లో సాధించాల్సిన ఆదాయ లక్ష్యాలపై మంత్రుల బృందం అధికారులకు దిశా నిర్దేశం చేసింది.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, ఆర్‌అండ్‌బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, మైన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, రెవెన్యూ సెక్రటరీ లోకేష్ కుమార్, టీజీఐఐసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.