13-01-2026 03:46:09 PM
రోడ్డు భద్రత వారోత్సవాల్లో ఎస్సై మోహన్ రెడ్డి
బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రహదారిపై ప్రయాణం చేసే సమయంలో రోడ్డు నిబంధనలను పాటిస్తే ప్రమాదాలను అరికట్ట వచ్చని సీఐ రవికుమార్ ఎస్సై మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం బిచ్కుంద పట్టణ కేంద్రంలో ఎస్సై మోహన్ రెడ్డి ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.
రోడ్డు భద్రత వారోత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణ పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. బైక్ పై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాలలో ప్రయాణించేటప్పుడు సీటు బెల్టు తప్పకుండా ధరించాలని, సెల్ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలను నడపరాదని సూచించారు. ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపితే ప్రమాదాలకు గురవుతారని దానివల్ల కుటుంబం రోడ్డున పడుతుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ రవి కుమార్ గ్రామ ప్రజలు, పోలీసు సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.