07-02-2026 11:29:10 AM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి సమీకృత బాలికల వసతి గృహంలో చోటు చేసుకున్న విద్యార్థుల ఫుడ్ పాయిజన్ ఘటన కలవరపరిచింది. పట్టణంలోని బెల్లంపల్లి బస్తిలోని ఉన్న బాలికల వసతిగృహంలో శుక్రవారం రాత్రి భోజనం చేసిన అనంతరం 40 మందికి పైగా విద్యార్థినులువాంతులు, విరేచనాలు చేసుకున్నారు. ఈ ఘటనలో వాంతులు, విరోచనాలు అధికమై కొంతమంది బాలికలు స్పృహ కోల్పోయినట్లు తెలిసింది. విద్యార్ధులను తిన్న మిల్ మేకర్ కూరలో పురుగులు ఉన్నాయని విద్యార్థినులు తెలిపారు.
విద్యార్థులు గ్రహించి ఈ విషయాన్నీ వార్డెన్కు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. విద్యార్థుల ఘటన సమాచారంతో స్థానిక బస్తి వాసులే అస్వస్థకు గురైన విద్యార్థులను సొంత వాహనాల్లో హుటా హుటిన బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే క్రమంలో హాస్టల్కు ప్రైవేట్ ఆర్ఎంపీ డాక్టర్ను తీసుకువచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థినులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలియగానే బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు. వసతి గృహాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.