మొక్కజొన్న రైతుల ఉసురు తగలదా
కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజం
జడ్చర్ల: అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి రావడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మండిపడ్డారు. శనివారం జడ్చర్ల, కల్వకుర్తి 167వ జాతీయ రహదారిపై స్నేహ ఇండస్ట్రియల్ వద్ద ఆందోళన చేస్తున్న మొక్కజొన్న రైతులకు ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జడ్చర్ల పత్తి మార్కెట్లో కొనుగోలు చేసిన మొక్కజొన్నను గోదాములకు తరలించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని లక్ష్మారెడ్డి విమర్శించారు.
దాదాపు 40 రోజులుగా రైతులు మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నారని, అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు రోజుల క్రితమే అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంపై ఆయన నిలదీశారు.నాగసాల గోదాం వద్దకు 40 ట్రాక్టర్లు వెళ్తే, కేవలం 4 ట్రాక్టర్లను మాత్రమే అన్లోడ్ చేసి మిగతా వారిని రాత్రంతా రోడ్డుపైనే ఉంచడం దారుణమన్నారు.రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, దిగుబడిపై ప్రభుత్వానికి కనీస అంచనా లేదని లక్ష్మారెడ్డి విమర్శించారు. గన్నీ బ్యాగులు, హమాలీలు, లారీలు, గోదాముల వంటి అంశాలపై ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే నేడు రైతులు ఇక్కట్లు పడుతున్నారు.
పండించడానికి పడే కష్టం కంటే, అమ్ముకోవడానికి రైతులు ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు.జడ్చర్ల మార్కెట్లో ఉన్న 40 వేల బస్తాల మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించాలి.మిగిలిన పంటను తక్షణమే కొనుగోలు చేయాలి.రైతులకు రవాణా, అన్లోడింగ్ సమస్యలు లేకుండా చూడాలి.ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యను పరిష్కరించకపోతే, బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. రైతులకు బిఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.ఈ నిరసనలో లక్ష్మారెడ్డితో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులు, భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.






