మొక్కజొన్న రైతుల ఉసురు తగలదా
కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజం
జడ్చర్లలో మొక్కజొన్న రైతులు 40 రోజులుగా మార్కెట్లోనే వేచి చూస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు.
జడ్చర్ల: మొక్కజొన్న రైతుల సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది.
జడ్చర్ల–కల్వకుర్తి జాతీయ రహదారిపై రైతులు ఆందోళనకు దిగగా, మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
రైతులు దాదాపు 40 రోజులుగా మార్కెట్లోనే వేచి చూస్తున్నారని, అధికారులు స్పందించకపోవడం దారుణమని అన్నారు.
జడ్చర్ల పత్తి మార్కెట్లో కొనుగోలు చేసిన మొక్కజొన్నను గోదాములకు తరలించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సమస్యను ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.
నాగసాల గోదాం వద్ద 40 ట్రాక్టర్లు వెళ్తే, కేవలం 4 ట్రాక్టర్లను మాత్రమే అన్లోడ్ చేసి మిగతా రైతులను రాత్రంతా రోడ్డుపైనే ఉంచడం అన్యాయమని మండిపడ్డారు.
తాజా రాజకీయ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, దిగుబడిపై ప్రభుత్వానికి సరైన అంచనా లేదని విమర్శించారు. గన్నీ బ్యాగులు, హమాలీలు, లారీలు, గోదాముల వంటి అంశాల్లో ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
పంట పండించడం కంటే అమ్ముకోవడమే కష్టంగా మారిందని రైతుల ఆవేదన వ్యక్తమవుతోంది.
జడ్చర్ల మార్కెట్లో ఉన్న 40 వేల బస్తాల మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించాలని డిమాండ్ చేశారు. మిగిలిన పంటను తక్షణమే కొనుగోలు చేయాలని కోరారు.
తాజా బ్రేకింగ్ న్యూస్ కోసం విజయక్రాంతి న్యూస్ ను సందర్శించండి.
ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ నిరసనలో బీఆర్ఎస్ నాయకులు, భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.






