9 April, 2026 | 3:15 PM

బాధితులకు అండగా 'కూసంపూడి'.. ఆస్పత్రిలో క్షతగాత్రులకు పరామర్శ!

09-04-2026 01:37 PM

 వేంసూర్. ఏప్రిల్ 9. ( విజయ క్రాంతి): వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో జరిగిన ఘోర ట్రాక్టర్ ప్రమాదంపై సత్తుపల్లి మాజీ మున్సిపల్ ఛైర్మన్ కూసంపూడి మహేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి పలువురికి తీవ్ర గాయాలయ్యాయనే వార్త తెలిసిన వెంటనే ఆయన స్పందించారు. ప్రమాదంలో గాయపడి సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కూలీలను కూసంపూడి మహేష్ స్వయంగా పరామర్శించారు.

ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మేమంతా మీకు అండగా ఉన్నాం అధైర్యపడవద్దు అని బాధితులకు భరోసా ఇచ్చారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం తగిన ఏర్పాట్లు చేయాలని అక్కడి వైద్య సిబ్బందిని కోరారు. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని మాట ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా, ఎక్కడ ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తూ బాధితులకు అండగా నిలవడం కూసంపూడి మహేష్ శైలి. ఈ రోజు కందుకూరు కూలీల విషయంలో ఆయన చూపిన చొరవను స్థానిక ప్రజలు, బాధితుల కుటుంబాలు హర్షిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు నాయకులు పాల్గొన్నారు.