calender_icon.png 26 June, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డికి యూకే మాజీ ప్రధాని టోనీ లేఖ

25-06-2025 08:08:12 PM

హైదరాబాద్: రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి తెలంగాణ రైజింగ్-2047(Telangana Rising-2047) దార్శనికతతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ధేశించుకున్న లక్ష్యాలు ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)కి యూకే మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్(Former UK Prime Minister Tony Blair) లేఖ రాశారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా టోనీ బ్లెయిర్ తో ముఖ్యమంత్రి సమావేశమై తెలంగాణ రైజింగ్-2047 విజన్ గురించి వివరించారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడం, పెట్టుబడులను ఆకర్షించడం, రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యతనిస్తూ, మౌలిక సదుపాయాల కల్పన, ఐటీ, ఇతర రంగాల్లో లక్ష్యాలు, వాటిని సాధించుకునే మార్గాలను పేర్కొన్నారు.

ఈ భేటీ సందర్భంగానే తెలంగాణ రైజింగ్ విజన్(Telangana Rising Vision) రూపకల్పన, అమలుకు సంబంధించి టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్ (@InstituteGC) సంస్థతో తెలంగాణ ప్రభుత్వం (లెటర్ ఆఫ్ ఇంటెంట్) ఒక ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ రైజింగ్ విజన్‌లోని స్పష్టత, నిర్దేశించుకున్న లక్ష్యాలు ఎంతో ఆకట్టుకున్నాయంటూ తాజాగా రాసిన లేఖలో టోనీబ్లెయిర్, సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. తెలంగాణ విజన్‌కు అనుగుణంగా లక్ష్యాల సాధనకు భారతదేశంలోని టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్(TBIGC) ప్రతినిధులు ప్రభుత్వానికి సహకరిస్తారని వెల్లడించారు. తదుపరి కార్యాచరణపై ముందుకు వెళ్లడానికి ఏమైనా సందేహాలుంటే తెలంగాణ అధికారులు టీబీఐజీసీ భారత ప్రతినిధిని సంప్రదించవచ్చని ఆ లేఖలో టోనీబ్లెయిర్ స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ విజన్ – 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.