calender_icon.png 12 January, 2026 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్‌లో నాలుగు డివిజన్లు చేయాలి

12-01-2026 12:43:11 AM

అమీన్పూర్ డివిజన్ల ఏర్పాటులో లోపించిన శాస్త్రీయత

లేనిపక్షంలో జీహెచ్‌ఎంసీని ముట్టడిస్తాం 

పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి 

పటాన్చెరు, జనవరి 11: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బల్దియా డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించిందని.. ఒక లక్ష 20 వేల ఓటర్లు కలిగిన అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కేవలం రెండు డివిజన్లు ఏర్పాటు చేయడం ఇందుకు ఉదాహరణ అని.. ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయలను బలపరుస్తూ వెంటనే మరో రెండు డివిజన్లు ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో జిహెచ్‌ఎంసి కార్యాలయాన్ని ముట్టడిస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హెచ్చరించారు. కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో కిష్టారెడ్డిపేట గ్రామంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆదివారం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్‌ఎంసి పరిధిలో నూతన డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిందని తెలిపారు. ఈ క్రమంలో పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలను జిహెచ్‌ఎంసిలో విలీనం చేయడంతో పాటు ఆరు డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు, సర్వేలు నిర్వహించకుండా కేవలం గూగుల్ మ్యాప్స్ ఆధారంగా డివిజన్లను ఏర్పాటు చేయడం అన్యాయమని అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో 1,20,000 ఓటర్లతో పాటు మూడు లక్షల జనాభా ఉండగా కేవలం రెండు డివిజన్లు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి జరగాలంటే 25 వేల నుండి 30 వేల ఓటర్లకు ఒక డివిజన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇప్పటికే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి, బల్దియా కమిషనర్ కు వినతి పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మరో రెండు నూతన డివిజన్లు ఏర్పాటు చేయాలని.. లేనిపక్షంతో వేలాది మందితో కలిసి హైదరాబాద్ లోని బల్దియా  ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.  ప్రభుత్వం పునరాలోచించక పోతే  సంక్రాంతి తర్వాత మరోమారు సమావేశమై కార్యాచరణ ప్రకటిద్దామని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, ఆయా గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, అఖిలపక్ష బృందం సభ్యులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.