06-06-2025 12:25:06 AM
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): బాలికల రక్షణ కోసం స్నేహ కమిటీలను ఏర్పాటు చేయబోతున్నామని, స్వీయ రక్షణ టీములుగా స్నేహ కమిటీలు పనిచేస్తాయని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. హైదరాబాద్లో రెండు రోజుల పాటు నిర్వహించిన మేధోమథన సదస్సు గురువారం ముగిసింది. ఈ ముగింపు సభలో మంత్రి మాట్లాడారు. అంగన్వాడీ సెంటర్ల ద్వారా అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పిస్తామన్నారు.
చాలా చోట్ల ముళ్ల పొదల్లో, చెత్తకుప్పల్లో అప్పుడే పుట్టిన బిడ్డలను వదిలేసి వెళ్తున్నారని, దీంతో శిశువుల ప్రాణాలు పోతున్నాయని, దీన్ని నివారించేందుకు వీలున్న చోట ఊయలలను ఏర్పాటు చేస్తామన్నారు. బిడ్డలను ఆ ఊయలలో వదిలేస్తే వారి బాధ్యతను తామే స్వీకరిస్తామని తెలిపారు. అంగన్ వాడీ కేంద్రాల్లో కరీంనగర్, నారాయణపేట జిల్లాల్లో అమలవుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్లను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు.
మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో ఒక అడ్వుజరీ కమిటీ నియమిస్తామని, వారి సలహాలు సూచనలతో శాఖ ద్వారా అందుతున్న సేవలను మరింత పటిష్టపరుస్తామన్నారు. మహిళా, బాలికల భద్రత మీద పనిచేసే స్వచ్ఛంద సంస్థలను గుర్తించి అంగన్వాడీలను వారితో అనుసంధానం చేస్తామన్నారు. బాల్యవివాహాల నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వేయి అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించి ఇస్తామని వెల్లడించారు. అంగన్వాడి గదుల్లోని దేశ భవిష్యత్తు ఉందని, కరీంనగర్లో ప్రతి శుక్రవారం అంగన్వాడి సిబ్బంది గ్రామస్థులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని, అదేవిధంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని సూచించారు.
ఆకాశాన్ని చీల్చుకొని అమ్మాయిలు అంతరిక్షానికి వెళ్లినా భూమి మీద కొన్నిసార్లు రక్షణ కరువు అవుతుందని, అందుకే అమ్మాయిల స్వీయ రక్షణ కోసం బాలికా రక్షక టీములను ఏర్పాటు చేస్తామన్నారు. అమ్మాయిలను వేధిస్తే సంఘ బహిష్కరణకు గురవుతారని హెచ్చరించారు.