08-11-2025 12:00:00 AM
రాష్ర్టంలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయపెడుతున్నాయి. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న వారి ఫోటోలు చూ స్తుంటే చాలా బాధ కలుగుతుంది. రాష్ట్రంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం, రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారు కావడం, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం, మితిమీరిన వేగం, కాలం చెల్లిన వాహనాలు, పరిమితికి మించిన లోడ్తో పరుగులు తీసే లారీలు, వాటర్ ట్యాంకర్లు మృత్యు కూపాలుగా మారి నిత్యం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయనేది వాస్తవం.
మొన్న కర్నూల్ స్లీపర్ బస్సు ప్రమా దం కావొచ్చు.. నిన్న చేవేళ్ల బస్సు దుర్ఘటన కావొచ్చు.. ఈ రెండింటిలోనూ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. దీనికి తోడు ఇటీవల కాలంలో సెల్ఫోన్ డ్రైవింగ్ విపరీతంగా పెరిగిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. జనంతో కిక్కిరిసిపోయే నగర రోడ్లు కానీ.. భారీ వాహనాలు వెళ్లే హైవేలపై చూసుకున్నా.. టూ వీలర్స్ నడిపేవాళ్లు విచ్చలవిడిగా సెల్ఫోన్ మాట్లాడుతూ ప్రమాదకర డ్రైవింగ్ చేస్తున్నారు.
దీనివల్ల రాష్ట్రంలో యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయి. తక్షణమే పోలీసులు దీనిని తీవ్రమైన నేరంగా పరిగణించి కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరముంది. రవాణా శాఖ అధికారులు కూడా వాహనాల విష యంలోనూ, లైసెన్సుల మంజూరులోనూ ముందుజాగ్రత్తలను పాటించాలి. ట్రాఫిక్, ఆర్టీఏ విభాగాల్లో సిబ్బంది కొరత లేకుండా చూస్తే రోడ్డు ప్రమాదాలను నివారించడం సులభమవుతుంది.
లక్ష్మీనారాయణ, కరీంనగర్