calender_icon.png 14 September, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం

14-09-2025 04:57:47 PM

రామచంద్రపురం,(విజయక్రాంతి): ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం రామచంద్రపురం డివిజన్ పరిధిలో ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమ సంఘం రామచంద్రపురం యూనిట్ సర్వసభ్య సమావేశానికి జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిర్మించిన పెన్షనర్ల సంక్షేమ సంఘం భవనం ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదని సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.

దీంతో రామచంద్రపురం ప్రెస్ క్లబ్ సభ్యులతో చర్చించి, సంఘ భవనానికి మరో అంతస్తు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తాన్ని పెన్షనర్ల సంక్షేమ సంఘానికే కేటాయిస్తున్నామని, పై అంతస్తును సుమారు రూ.30 లక్షల వ్యయంతో నిర్మించి అందులో ప్రెస్ క్లబ్ కార్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు.

ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన ప్రభుత్వ పెన్షనర్లు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములవాలని కోరారు. తమ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న జిఎంఆర్‌కు సంఘం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలుపుతూ ఘన సన్మానం చేశారు.