రేపటి బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతు
బీసీల పట్ల బిజెపి, బిఆర్ఎస్ పార్టీల కపట ప్రేమ
కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి, (విజయక్రాంతి): బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఈనెల 18న బీసీ సంఘాలు తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని శుక్రవారం కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే విజయరమణ రావు(MLA Vijaya Ramana Rao) తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... బిసి లకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు పెరగాలని బీసీ కుల గణన నిర్వహించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు.
బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ నినాదంగా పెట్టుకుందని, రేపు జరిగే బందులో పెద్దపెల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని, 42 శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ ఆమోదానికి పంపితే తగిన స్పందన రాలేదని, ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో ధర్నా నిర్వహించినప్పటికీ కేంద్రం నుండి ఫలితం శూన్యమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ల పెంపు పట్ల ఇష్టం లేదన్నారు.
రాష్ట్రానికి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు, ఇందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ బిల్లు ఆమోదానికి గవర్నర్ ను ఒప్పించలేకపోతున్నారని, బిజెపి తీరు ఇలా ఉండగా, గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 23 శాతానికి బీఆర్ఎస్ పార్టీ తగ్గించిందని, ప్రస్తుతం ఈ రెండు పార్టీలు బీసీల పట్ల చూపుతున్న కపట ప్రేమను ప్రజలు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాల్వశ్రీరాంపూర్ మండల అధ్యక్షులు గజనావేన సదయ్య, ఓదెల మల్లికార్జున స్వామి డైరెక్టర్లు మరియు మార్కెట్ డైరెక్టర్లు, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, ఎంపీపీ లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






