19-09-2025 11:45:25 PM
హనుమకొండ,(విజయక్రాంతి): కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి) పనులు వేగంగా సాగుతున్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జరుగుతున్న ఈ నిర్మాణ పనులను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... కాజీపేట ఆర్ఓబి కింద ఇప్పటికే మొదటి వంతెన పనులు పూర్తికాగా, రెండో వంతెన నిర్మాణం కొంతమేర పురోగమించిందని తెలిపారు. రైల్వే అధికార్ల సూచనల మేరకు ఇనుప వంతెన నిర్మాణం చేపట్టామని తెలిపారు.
ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించేందుకు, ట్రాఫిక్ను తగ్గించేందుకు రెండో వంతెన పనులను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో ఎటువంటి ఆలస్యం జరుగకుండా చూడాలని, అనవసరమైన జాప్యాలను నివారించాలన్నారు.ఇదిలా ఉండగా, పాత వంతెన మరమ్మత్తు పనుల నిమిత్తం ప్రభుత్వం రూ.59 లక్షల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించుకుని, వంతెనను మరింత సురక్షితంగా, వినియోగయోగ్యంగా మార్చాలని సంబంధిత ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.ఈ సందర్బంగా ఆయన స్థానిక ప్రజలు, సాంకేతిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాత వంతెన వద్ద మరమ్మత్తు పనుల స్థితిగతులను పరిశీలించారు.