బైకు దొంగల ముఠా అరెస్టు
8 బైకులు, ౧౦ వేలు స్వాధీనం
వరంగల్ తూర్పు, జూన్ 6 : పోలీసుల కళ్లుగప్పి బైకు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను వరంగల్ ఇంతేజార్గంజ్ పోలీసులు అరెస్టుచేశారు. గురువారం పోలీస్ స్టేషన్లో వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ మీడియాకు వివరాలు వెల్లడించారు. గత మూడు నెలలుగా వరంగల్ సబ్ డివిజన్ పరిధిలో బైకులను దొంగిలించి విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశామని తెలిపారు. రంగు ప్రశాంత్, ఈసంపల్లి ప్రేమ్కుమార్తోపాటు మరో మైనర్ బాలుడు జల్సాలకు అలవాటు పడి తప్పుడుదారిలో డబ్బు సంపాదించాలన్న ఆశతో బైకులను దొంగిలిస్తున్నట్టు చెప్పారు.
గురువారం వరంగల్ పోస్టాఫీస్ సెంటర్లో ఎస్సై వెంకన్న తనిఖీలు నిర్వహిస్తుండగా, పసిగట్టిన నిందితులు పరారీ కారవడానికి ప్రయత్నించారు. వీరిని పోలీసులు పట్టుకొని విచారించగా, అసలు విషయం వెలుగు చూసింది. ఇప్పటివరకు 8 వాహనాలను దొంగిలించినట్టు ముఠా సభ్యులు అంగీకరించినట్టు తెలిపారు. దొంగిలించిన బైకులను రంగు ప్రశాంత్ ఇంటి వద్ద ఓ ఖాళీ స్థలంలో భద్రపరిచే వారని, వాటిని విక్రయించేవారని పేర్కొన్నారు. వీరి నుంచి 8 బైకులతోపాటు రూ.౧౦ వేల నగదును స్వాధీనం చేసుకొన్నామని వెల్లడించారు. కేసు నమోదు చేసి కోర్టులో హజరు పరిచామని తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంతో ప్రతిభ కనబరచిన ఎస్సై వెంకన్న, క్రైం పార్టీ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.






