04-02-2026 02:34:07 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని సర్ సిల్క్ కాలనీ, వార్డు నెంబర్ -3లో మురికి కాలువల సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంది. నెలల తరబడి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతూ కాలనీవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.కాలువలు పూర్తిగా చెత్తతో నిండిపోవడంతో పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారని వాపోతున్నారు.
ముఖ్యంగా రాత్రి సమయంలో దుర్వాసన భరించలేనంతగా మారడంతో పాటు దోమల బెడద అధికమై జ్వరాలు, చర్మవ్యాధులు వ్యాపించే ప్రమాదం నెలకొన్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంపై కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే కాలువ శుభ్రత చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.