7 April, 2026 | 4:37 PM

కేంద్రం కీలక నిర్ణయం.. 5 కిలోల గ్యాస్‌ సిలిండర్ల సరఫరా పెంపు

07-04-2026 03:01 PM

న్యూఢిల్లీ: వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం(Central Government) భారీ ఊరట కల్పించింది. వలస కార్మికులకు గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌లో యుద్ధం కారణంగా ద్రవ పెట్రోలియం గ్యాస్ (Liquid Petroleum Gas) సరఫరాకు కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో, వలస కార్మికులకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చే 5 కేజీల సిలిండర్ల రోజువారీ కేటాయింపును రెట్టింపు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 

కార్మికులకు సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం కోరింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్(Petroleum Secretary Neeraj Mittal) రాష్ట్రాలకు లేఖ రాశారు. గ్యాస్ సరఫరాలను నిర్ధారించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశించింది. ఓఎంసీల సాయంతో పౌరసరఫరాలశాఖ ద్వారా గ్యాస్ పంపిణీ చేయనుంది. వర్షా కాలంలో గ్యాస్ కొరత లేకుడా చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం పంపిన లేఖ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించిన అదనపు 5 కిలోల సిలిండర్లను వలస కార్మికులకు సరఫరా చేయడానికి మాత్రమే వినియోగించాలి. చమురు విక్రయ సంస్థల సహకారంతో ఈ సరఫరా ప్రక్రియను సులభతరం చేస్తారు. వలస కార్మికులకు, సమాజంలోని ఇతర బలహీన వర్గాలకు వంటకు అవసరమైన ఇంధనం తగినంతగా అందుబాటులో ఉండేలా చూడటమే ఈ చర్య యొక్క ముఖ్య ఉద్దేశం.