calender_icon.png 6 May, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

06-05-2025 04:30:50 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాలలో కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కిన గీతా కార్మికుడు ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి తీవ్ర గాయాలు అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల పరిధిలోని నారాయణ గూడెం గ్రామానికి చెందిన కాసాని వెంకటేశ్వర్లు అనే గీత కార్మికుడు గ్రామ సమీపంలోని తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు మొకు తెగిపోయి చెట్టు పైనుండి కింద పడిన సంఘటనలో గీత కార్మికుడు వెంకటేశ్వర్లుకు కుడికాలు విరిగిపోగా, తలకు, ఇతర శరీర భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయి.

వెంటనే చుట్టుపక్కల ఉన్న స్థానికులు స్పందించి ఆటోలో హుటాహుటిన వెంకటేశ్వర్లును కోదాడ వైద్యశాలకు తరలించగా, మెరుగైన వైద్యం కోసం కోదాడ నుండి హైదరాబాదుకు తరలించడం జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటేశ్వర్లు ప్రతిరోజు గీత వృత్తిని నమ్ముకుని కల్లు గీస్తూ ముంజలు కొట్టి అమ్ముతూ వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని స్థానికులు తెలిపారు, ఎలాంటి ఆస్తిపాస్తులు భూములు లేక గీత వృత్తిని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న వెంకటేశ్వర్లుకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు, తన కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం, స్థానిక అధికారులు మానవత్వంతో తోడ్పాటు అందించాలని గ్రామానికి చెందిన పలువురు కోరుతున్నారు.