తెలంగాణ భవన్లో జెన్జీ యువతులు
- రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్టు కేటీఆర్కు వెల్లడి
- అండగా ఉంటామని కేటీఆర్ హమీ
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఆదివారం ఆసక్తికర సంఘటన జరిగింది. ఉన్నత చదువుల కోసం సిద్ధమవుతున్న నలుగురు జెన్ జీ యువతులు వచ్చి కేటీఆర్ను కలిశారు. తాము రాజకీయాల్లోకి రావాలన్న లక్ష్యంతో భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటు న్నామని కేటీఆర్తో తెలిపారు. ఇప్పటికే పాఠశాల దశ నుంచి ఒక గ్రూప్గా తాము పాలసీ అంశాలతో, సమాజంలో మార్పు తీసుకురావలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు.
రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఈ యువతకు కేటీఆర్ భరోసానిచ్చారు. రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో తన దగ్గరకు వచ్చిన ఈ నలుగురిని చూసి ఆశ్చర్యపోయానని, వారితో గడిపిన క్షణాలు తనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని కేటీఆర్ స్వయంగా తన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ నలుగురు విద్యార్థినులలో... లండన్లోని కింగ్స్ కాలేజీలో పాలిటిక్స్, ఎకనామిక్స్ అండ్ ఫిలాసఫీ చదవనున్న సరయు, నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థిని లాస్య, సింబ యాసిస్ లా స్కూల్ విద్యార్థిని రేవతి, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బీకాం చదువుతున్న అశ్విని ఉన్నారు. పార్టీ కార్యాలయంలోని తన బృందంతో కలిసి పనిచేసేందుకు వారికి అవకాశం కల్పిస్తామని, రాజకీయ ప్రయాణంలో తగిన సూచన లు, మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. వీరు భవిష్యత్తులో గొప్ప నాయకులుగా ఎదుగుతారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేటీఆర్తో కాసేపు మాట్లాడిన ఈ యువతులు త్వరలో తమ బృందంలో కలిసి వస్తామన్నారు.






