05-09-2025 12:26:29 AM
రేగొండ, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి):యూరియా ఇవ్వండి మహాప్రభో అంటూ రైతన్నలు గగ్గోలు పెడుతున్న పాలకులు కనికరించడం లేదంటూ మండల రైతులు వాపోతున్నారు.
వ్యవసాయ పనులు మాని సహకార సంఘం వద్ద రోజు బారులు తీరి నిలుచున్న నాయకుల కళ్ళకు రైతుల గోస కానరావడం లేదని మండిపడుతున్నారు.గురువారం ఉదయం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాసారు.
యూరియా కొరత నివారణకు కనీస చర్యలు తీసుకోకుండా రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్ లో గంటల తరబడి నిల్చుంటే అదృష్టం బావుండి బస్తా దొరికితే అదే పది వేలంటూ అనుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు తగిన యూరియా నిల్వలను అందించాలని రైతులు వేడుకుంటున్నారు.
ఆత్మకూరు మండలం పెద్దాపూర్..
హనుమకొండ, సెప్టెంబర్ 4 (విజయ క్రాంతి): హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో యూరియా కోసం గత రెండు రోజులుగా రైతులు బారులు తీరుతున్నారు. వ్యవసాయ రంగంపై జీవనోపాధి పొందుతున్న రైతులు వారి కుటుంబాలు ఉదయం నుండి సాయంత్రం వరకు వ్యవసాయ పనులు వదులుకొని లైన్ లో నిలబడుతున్నారు.
యూరియా బత్తాల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు యూరియా సరఫరా చేస్తున్నామని చెప్పినప్పటికీ రైతులు యూరియా బత్తాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. కేవలం రోజుకు 300 బస్తాలు ఇస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ప్రాథమిక సంఘం కమిటీ లోని పలు గ్రామాలకు చెందిన రైతులు వందలాదిమంది సహకార సంఘ కార్యాలయానికి చేరుకొని బారులు తీరుతున్నారు.
ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ రైతులు రోజుల తరబడి యూరియా బస్తాల కోసం నిరీక్షణ చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత లేకుండా చూడాలని యూరియా బస్తాలను సకాలంలో పంపిణీ చేయాలని దాప్యం చేస్తే పంటలకు నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు.