27 June, 2026 | 9:22 PM

ఆగస్టు 15 నాటికి గోదావరి నీళ్లు

14-06-2024 12:42 AM

ఎన్కూరు లింకు కెనాల్‌ను పూర్తి చేసి లక్షా ఇరవై వేల ఎకరాలకు నీరందిస్తాం 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మంత్రులతో సీతారామ ప్రాజెక్టు పరిశీలన

ఎన్కూర్ లింకు కెనాల్‌కు రాజీవ్ కెనాల్‌గా నామకరణం

 లింక్ కాలువను పూర్తి చేయడానికి రూ.72 కోట్లు 

త్వరలోనే పంప్ హౌజ్ పనులను ప్రారంభిస్తామని వెల్లడి

ఖమ్మం, జూన్ 13 (విజయక్రాంతి ): ఆగస్టు 15 నాటికి ఎన్కూరు లింకు కెనాల్‌ను పూర్తి చేసి లక్షా ఇరవై వేల ఎకరాలకు గోదావరి నీళ్లను అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద ఉన్న సీతారామ హెడ్ రెగ్యులేటరీ పనులను, వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అక్కడి నుంచి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పంప్ హౌజ్- వద్దకు చేరుకొని పనులను పరిశీలించారు. అనంతరం పవర్ సప్లైను ప్రారం భించారు. ఆ తర్వాత పంపు హౌజ్‌హా వద్దకు చేరుకొని ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో మాట్లాడారు. 

అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కేవలం రూ. 2,654 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను సీతారామ ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసి ఖర్చును రూ.20 వేల కోట్లకు పెంచి గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు. దశాబ్ద పాలనలో సీతారామ ప్రాజెక్టుపై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన బీఆర్‌ఎస్ ఒక్క ఎకరానికీ సాగునీరు ఇవ్వలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలు చేశామన్నారు.

సీతారామ ప్రాజెక్టుకు ఎన్‌ఎస్పీఎల్ కెనాల్‌కు లింకు చేయడానికి 9 కిలోమీటర్లు ఉన్న ఎన్కూర్ లింక్ కెనాల్‌ను పూర్తి చేయడానికి రూ.72 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఎన్నికలకు ముందే ఈ పనులను సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వైరాకు వచ్చి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా పంప్స్ ట్రయల్ రన్ చేయడానికి కావలసిన పవర్ సప్లై కోసం నిధులు సమకూర్చినట్లు వెల్లడించారు. ట్రయల్ రన్ ప్రాసెసింగ్ కొనసాగుతున్నదని చెప్పారు. అలాగే ఎన్కూర్ లింకు కెనాల్‌ను రాజీవ్ కెనాల్‌గా నామకరణం చేస్తున్నట్టు వెల్లడించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌజ్ 1, 2, 3 డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు.

నీటిపారుదర రంగాన్ని నాశనం చేసిన కేసీఆర్: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ప్రణాళిక లేకుండా, అనాలోచితంగా నీటిపారుదర రంగాన్ని మాజీ సీఎం కేసీఆర్ నాశనం చేశారని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు రూ.9,04,000 కోట్లు ఖర్చుపెట్టి కేవలం 93,000 ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే సాగులోకి తెచ్చారని వివరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూ.27 వేల కోట్లు ఖర్చుపెట్టి ఒక ఎకరా కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ.9,000 కోట్లు ఖర్చుపెట్టి ఒక ఎకరానికి నీరివ్వలేదన్నారు.

తాము తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సాగునీరు ఇవ్వడానికి ప్రణాళికను తయారు చేసుకొని ముందుకు పోతున్నట్లు వివరించారు. తమ ప్రజా ప్రభుత్వం గోదావరి నదీ జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చి సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నదన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు మేలు జరిగే విధంగా భారీ, మధ్య, చిన్న తరహా సాగునీటి పెండింగ్ ప్రాజెక్టును ఖమ్మం జిల్లాలో పూర్తి చేస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు.

బీఆర్‌ఎస్‌ది అసమర్థ పాలన

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద ఉన్న సీతారామ హెడ్ రెగ్యులేటరీ పనులను పరిశీలించిన అనంతరం ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద నీటిపారుదల శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సమీక్ష జరిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్టు పనులు, కొనసాగుతున్న కెనాల్స్ పనులు, భూ సేకరణ, ప్రాజెక్టు పూర్తి కావడానికి కావలసిన నిధులు, ఎదురవుతున్న సమస్యలను ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు మంత్రులకు వివరించారు.

అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. కొత్తగూడెం, భద్రాచలం, పినపాక నియోజకవర్గాలకు తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సాగునీరు ఇవ్వడానికి నీటిపారుదలశాఖ ప్రణాళికను తయారు చేసుకొని ముందుకు పోతున్నామన్నారు. ఈ సమీక్షలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మేల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు, మాలోత్ రాందాస్ నాయక్, మట్టా రాగమయి, నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఈ భద్రాచలం వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌ఈ కొత్తగూడెం ఎస్.శ్రీనివాసరెడ్డి, ఈఈ సురేష్‌కుమార్ పాల్గొన్నారు.