calender_icon.png 22 July, 2025 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోపనపల్లి భూమికి ఎసరు!

22-07-2025 01:06:24 AM

రెవెన్యూ శాఖ అధికారుల తీరే కారణం 

కోట్ల విలువైన భూమిపై కన్నేసిన ప్రైవేట్ వ్యక్తులు

-ఉద్యోగులకు సమాచారం లేకుండా రెవెన్యూ అధికారుల సర్వే

-సైబరాబాద్ సీపీ,  కలెక్టర్‌కు ఉద్యోగ సంఘాల నాయకుల ఫిర్యాదు 

- ప్రైవేట్ వ్యక్తులకు పెద్దల అండదండలు

- వారం రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు

శేరిలింగంపల్లి, జూలై 21(విజయక్రాంతి): ఎన్నో ఏండ్లుగా ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల భూమికి ‘పెద్దలు’ ఎసరు పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారికంగా లేఅవుట్ చేసి ఫీజులు చెల్లించిన భూ ముల్లో కంటెయినర్ల ద్వారా పాగా వేసిన ప్రైవేట్ వ్యక్తులు, దర్జాగా అందులో పనులు కొనసాగిస్తున్నారు. దీనిపై భాగ్యనగర్ టీఎన్జీవోలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో ఈ వ్యవహారం కాస్తా మరో కీలక మలుపు తిరిగినట్టు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధం లేకుండానే కూకట్‌పల్లి కోర్టు ఉత్తర్వుల ఆధారంగా రెవెన్యూ అధికారులు సదరు వ్యక్తుల కోసం ఉద్యోగుల భూముల్లో సర్వే చేసినట్టు గుర్తిం చి ఉద్యోగ సంఘాల నేతలు అవాక్కయిన ట్టు తెలిసింది.

తమకు తెలియకుండానే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న తమ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అటు పోలీసు శాఖను కలిసినా, ఇటు రెవెన్యూ శాఖను కలిసినా సరైన స్పందన రాకపోవడంతో ఉద్యోగ సంఘాల నాయకులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ముఖ్యంగా ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. రికార్డుపరంగా తమ ఆధీ నంలో ని భూమిని పరిరక్షించకపోగా రికార్డుల్లోలేని సబ్ డివిజన్స్ సర్వే నంబర్ల ఆధారంగా ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భాగ్యనగర్ టీఎన్జీవో భూములు క్రమంగా ప్రైవేట్ వ్యక్తు ల చేతుల్లోకి పోతున్నాయి. తెరవెనుక ‘పెద్దలు’  కదుపుతున్న పావులతో రెవెన్యూ అధికారులు తోటి ఉద్యోగులకే ద్రోహం చేస్తూ భూములకు ఎసరు పెట్టేదిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలు స్తున్నది.

ఇంజక్షన్ ఆర్డర్‌తో..

 సర్వే నంబరు 37లో బసవతారకనగర్‌లోని ఎనిమిది ఎకరాలను ఆధీనంలోకి తీసు కున్న రెవెన్యూ శాఖ ప్రతిపక్షాలతో పాటు, ఇతరులెవరూ నిరుపేదలకు అండగా నిలువకుండా కట్టడి చేసింది. మరోవైపు సర్వేనం బరు 36లోని భూముల్లో ఏకంగా ప్రైవేట్ వ్యక్తులు కంటెయినర్లతో పాగా వేసినా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సోమ వారం ఉద్యోగ సంఘాల నేతలు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతిని కలిసి ఫిర్యా దు చేశారు. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం ముజీబ్ హుస్సేని, అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకట్, భాగ్యన గర్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్ తదితరులు సీపీని కలిసి తమ భూమిని పరిరక్షించాలని వినతిపత్రం ఇచ్చారు.

అనంతరం సీపీ సూచన మేరకు ఉద్యోగ సంఘాల నేతలు మాదాపూర్ డీసీపీ వినీత్‌ను కలిశారు. ఈ సంద ర్భంగా సదరు ప్రైవేట్ వ్యక్తులు కూకట్‌పల్లి కోర్టు నుంచి తెచ్చుకున్న ఇంజక్షన్ ఆర్డర్‌ను చూపిస్తున్నారని పోలీసులు చెప్పడంతో సదరు నేతలు అవాక్కయినట్టు తెలిసింది. ఓవైపు గతంలోనే హైకోర్టులో స్టేటస్ కో ఉన్న తర్వాత ఈ ఉత్తర్వులు ఎలా వచ్చాయని ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ విషయం లో తామేమీ చేయలేమని అక్కడి నుంచి సమాధానం రావడంతో ఉద్యోగ సంఘాల నేతలు వెనుదిరిగినట్టు సమాచారం.

సొసైటీ లేకున్నా..

వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులకు కేటా యించిన ఆ భూములను కేసీఆర్ హయాంలో కూడా పరిరక్షించారు. అయితే సర్కారు ఆధీనంలో లేదంటే ఉద్యోగులకు కేటాయించాలి. కానీ ప్రస్తుతం రెండింటికీ భిన్నంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోవడం వెనుక రెవెన్యూ శాఖ కీలకంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. సీపీని కలిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు కూకట్‌పల్లి కోర్టు ఉత్తర్వులను పరిశీలిస్తే అందులో విచిత్రకరమైన అంశాలున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. 2023 జనవరిలో సర్వే సంబరు 36లో తమ ప్లాట్లు ఉన్నాయంటూ 1980 దశకంలో డీ నర్సింగరావు నుంచి కొనుగోలు చేసినట్టుగా డాక్యుమెంట్లను చూపుతూ వినాయకనగర్ హౌసింగ్ సొసైటీ పేరిట కోర్టును ఆశ్రయించారు.

వాస్తవానికి ఆ సమయంలో భూములు ప్రభుత్వాధీనంలో ఉండటంతో పాటు రికార్డుపరంగా ప్రభుత్వానికే చెందుతాయి. కానీ కోర్టు ముందు ప్రభుత్వాన్ని కాకుండా టీఎస్ ఎన్జీవోను ఎక్స్ పార్టీగా చేర్చారు. వాస్తవానికి ఈ పేరు మీద సొసైటీ లేకపోవడం ఒక వం తైతే.. అందులో పేర్కొన్న చిరునామా ఉన్న గన్‌ఫౌండ్రీలోని భవనాన్ని భాగ్యనగర్ టీఎన్జీవో అంతకుముందు కొన్ని సంవత్సరాల కిందటే అమ్ముకొని ఆబిడ్స్ లోని వేరే భవనంలోకి వచ్చారు. దీంతో సదరు సొసైటీ నుంచి ఎలాంటి స్పందనా లేదంటూ న్యాయస్థానం ఎక్స్‌పార్టీగా పేర్కొంటూ ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ఆధారంగా రెవెన్యూ సర్వేయర్ 2024లో సర్వే నంబరు 36లో సర్వే చేసి ప్రైవేట్ వ్యక్తులకు భూమి చూపారనే విమ ర్శలు ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉంటే అది తమ భూమి అంటూ స్పందించా ల్సిన రెవెన్యూ అధికారులు ఆ పని చేయకపోగా... ఉద్యోగులకు సమాచారం ఇవ్వకుండానే ప్రైవేట్ వ్యక్తులకు పొజిషన్ చూపించారనే ఆరోపణలు వస్తు న్నాయి.

రెవెన్యూ అధికారుల హస్తం!

రెవెన్యూ అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేందుకు మరికొన్ని చర్యలు బలాన్ని చేకూరుస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సర్వే నంబర్ 36, 37లో డీ నర్సింగరావు, ఇతరులు చూపుతున్న సబ్ డివిజన్స్ సర్వేనం బర్లు లేవని 2021లోనే కేసీఆర్ ప్రభుత్వానికి రంగారెడ్డి కలెక్టర్ పంపిన నివేదికలో స్పష్టంచేశారు. ప్రస్తుతం భూభారతిలో సదరు వ్యక్తులు చూపుతున్న సబ్ డివిజన్స్ పేరిట వారి పేర్లు కనిపించడం లేదు. కానీ సర్వే నంబర్ 86లో ప్రైవేట్ వ్యక్తులు కంటెయినర్లతో పనులు చేస్తున్న భూముల్లో 2010లో ఉద్యోగులు అధికారికంగా లేఅవుట్ చేశారు. ఆ మేరకు అప్పట్లో 142.15 ఎకరాలకు ఫీజు చెల్లించడంతోపాటు నిబంధనల ప్రకారం వట్టినాగుల పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మార్టిగేజ్ డీడ్ చేశారు. అవి రద్దు కాకుండానే రెవెన్యూ అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు ద్వారాలు తెరిచారు.

రికార్డుల్లోకి ఎక్కకున్నా సర్వే

రాజేంద్రనగర్ ఆర్డీవో బసవతారకనగర్ 8 ఎకరాలను స్వాధీనం చేసుకునే క్రమంలో సర్వేనంబరు 87/లు, 37/రులోని 8 ఎకరాల భూమి అని స్పష్టంగా పేర్కొన్నారు. ఆర్డీవో తన ఉత్తర్వుల్లో ఈ సబ్ డివిజన్స్ పే ర్కొంటున్నారంటే రికార్డుపరంగా అవి ప్రభు త్వ ఆన్‌లైన్‌లో కనిపించాలని, అలా కనిపించడం లేదంటే అది ప్రభుత్వ భూమిగానే ఉన్నట్టు అని రిటైర్డ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సర్వే నంబర్ 36లో ప్రైవేట్ వ్యక్తులు కంటెయినర్లు వేసి పనులు చేస్తున్న భూములను సర్వే నంబర్ 36/ఎ,. 36/ఇ’గా పేర్కొన్నారు.

కానీ ఇలాంటి సబ్ డివిజన్స్ ఏవీ భూ భారతి ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. అంటే అధికారికంగా రికార్డులకు ఎక్కలేదు. అలాంటప్పుడు రెవెన్యూ సర్వేయర్ సదరు వ్యక్తులకు సర్వే చేసి ఎలా భూమి చూపిస్తారు? ప్రభుత్వ రికార్డుల్లో లేకుండా ప్రైవేట్ వ్యక్తులు పనులెలా నిర్వహిస్తారు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని ప్రకారం రెవెన్యూ అధికారులు నిబంధనలను అట కెక్కించి కేవలం ‘పెద్దల’ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వారం రోజులుగా ఆందోళన

తమ భూములను కాపాడుకోవడానికి గతవారం రోజులుగా ఉద్యో గులు ఆందోళన చేస్తున్నారు. తమకు సంబంధం లేకుండానే సదరు భూములలోకి ప్రైవేట్ వ్యక్తులను ఎలా అను మతించారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లేదంటే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చిరిస్తున్నారు.