02-06-2025 09:36:06 PM
సూర్యాపేట (విజయక్రాంతి): జిల్లాలో ట్రాన్స్ జెండర్లకు గౌరవ ప్రదమైన వృత్తిని కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని జిల్లా స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు(Welfare Department Officer Narasimha Rao) తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆద్వర్యంలో ట్రాన్స్ జెండర్లకు, మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పన ఎలక్షన్ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాల మేరకు ఉచితంగా కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పైలెట్ ప్రాజెక్ట్ కింద సూర్యాపేట జిల్లాలో ట్రాన్స్ జెండర్లకు కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. రెండు నెలల పాటు నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్లకు అన్నీ రకాల వసతులను కల్పించి ఉపాధి కొరకు కృషి చేయనున్నట్లు వెళ్లాడించారు. శిక్షణ అనంతరం బ్యాంక్ లోన్లు అందించి స్వయం ఉపాధికి తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ట్రాన్స్ జెండర్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ రూప, మిషన్ శక్తి కోఆర్డినేటర్ చైతన్య, పైనాన్స్ లిట్రసీ తేజస్విని, రేవతి, ఇరిగి కోటేశ్వరి, వినోద్, క్రాంతి, ట్రైనర్ కల్పన తదితరులు పాల్గొన్నారు.