02-06-2025 09:01:32 PM
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి..
హనుమకొండ (విజయక్రాంతి): నిరుపేదలకు సొంత నివాసాలను కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని తీసుకువచ్చిందని, ఈ పథకం కింద ఎంపికైన అర్హులైన లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి(Parakala MLA Revuri Prakash Reddy) అన్నారు. పరకాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలను స్మరించుకుంటూ అవతరణ వేడుకలు నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం, రైతులకు రైతు భరోసా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుల 21 వేల కోట్లను రుణమాఫీ చేసిందన్నారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంతో పేదల కుటుంబాల్లో సంతోషం నెలకొందన్నారు. పదేళ్ల తర్వాత రేషన్ కార్డులను ఇస్తున్నామని, అర్హులందరికీ అంచెలంచలుగా ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామన్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు 1800 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను అందజేస్తున్నట్లు తెలిపారు.
మంజూరు పత్రాలు అందుకున్న ఇందిరమ్మ ఇండ్లు పథకం లబ్ధిదారులు 15 రోజుల్లో ఇండ్ల నిర్మాణానికి ముగ్గులు పోసుకొని పనులు ప్రారంభించాలన్నారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ... 67 వేల ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.75 నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ లను ముఖ్యమంత్రి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. మహిళా సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం తమదన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి పథకాలు రానున్నాయని అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించేందుకు స్టాల్స్, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం బాగుందని ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం తరఫునుండి ఉచితంగా ఇసుకను అందిస్తున్నట్లు తెలిపారు. ట్రాన్స్పోర్ట్ చార్జీలను లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 1841 మహిళా సంఘాల సభ్యులకు రూ. 5.16 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును, 1511 మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు సంబంధించిన రూ. 153 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కుడా ఛైర్మెన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, పరకాల ఆర్డిఓ డాక్టర్ నారాయణ, తహసీల్దారులు, ఎంపీడీవోలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులు పాల్గొన్నారు.