28-10-2025 12:00:00 AM
ములుగు, అక్టోబర్ 27 (విజయక్రాంతి): బాలికలు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కస్తూరిబా గాంధీ విద్యాలయాల ఏర్పాటు ఏర్పాటు చేసి విద్యార్థినిల కు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప్రతి బాలిక ఉన్నత చదువులు చదవాలని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని మాధవరావుపల్లి గ్రామంలో 2కోట్ల 30లక్షల నిధులతో నిర్మించిన కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయ ము తరగతి గదులు, ప్రయోగశాలలను కలెక్టర్ దివాకర్ టిఎస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్ లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో బాలికలకు విద్య అవసరం లేదనే సనాత ధర్మం పాటిస్తూ వంటగదిలకే పరిమితం చేశారని,నేడు మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని వివరించారు. దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి విద్యా బోధన చేశారని, అప్పటి నుండి ఇప్పటి వరకు మహిళలు విద్యను బోధిస్తున్నారని తెలిపారు.
బాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఉండాలని ఉద్దేశంతో మహాత్మా గాంధీ సతీమణి కస్తూరిబా గాంధీ పేరుతో పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరు ఎంత నేర్చుకున్నామనేది ముఖ్యం కాదని నేర్చుకున్న పరిజ్ఞానాన్ని పదిమందికి తెలపడమే గొప్ప విషయమని అన్నారు.
తాను సైతం ప్రభుత్వ హాస్టల్లో ఉండి విద్యను అభ్యసించానని, ప్రతి బాలిక తమ పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన అందించడం జరుగుతుందని తెలిపారు. రానున్న పదవ తరగతి పరీక్షలలో రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేయాలని అన్నారు.