రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి
* ప్రభుత్వం ప్రకటించిన 2000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగులకు కంటి తుడుపే!
* 100% జిపిఎఫ్ చెల్లించామనడం అవాస్తవం
* కమ్యూటేషన్ కూడా రాలేదు
* ఆందోళనలో రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు
దమ్మపేట,(విజయక్రాంతి): తెలంగాణ జేఏసీకి ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం నిన్న 2000 కోట్లను విడుదల చేస్తూ 2024 మార్చ్ నుండి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావలసిన బకాయిలను విడుదల చేస్తున్నామని, అందులో ముఖ్యంగా జిపిఎఫ్ 2025 అక్టోబర్ వరకు 100% వస్తుందని, కమ్యూటేషన్ కూడా 2025 మే వరకు పంపిణీ జరిగిందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ చాలామంది రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బకాయిలు రాక ఆందోళన చెందుతున్నారని రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డం ముత్యం, నంగెడ్ల కనకదుర్గ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రభుత్వం ప్రకటించినట్లుగా జిపిఎఫ్ 100% రాలేదని, కేవలం 2025 మార్చి వరకు మాత్రమే కొందరికి వచ్చిందని, అదేవిధంగా కమ్యూటేషన్ కూడా మార్చి 2025 వరకు చాలా తక్కువ మందికి వచ్చాయని అన్నారు. ప్రభుత్వం ఏజీ జిపిఎఫ్ 100% ప్రకటించి జెడ్పి జిపిఎఫ్ ను విస్మరించారని, తప్పుడు ప్రచారాలతో రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చెందుతూ అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు.
రిటైర్మెంట్ బకాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి బకాయిల సాధనకు కృషి చేసిన రాష్ట్ర జేఏసీకి కృతజ్ఞతలు తెలుపుతూ, రాష్ట్ర జేఏసీతో జైంట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన విధంగా ప్రభుత్వం 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల, ఉపాధ్యాయుల జేఏసీతో చర్చలు జరిపాలని అప్పుడే సరైన సమాచారం రిటైర్డ్ ఉద్యోగులకు అందుతుందని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో 6000 కోట్లను రిటైర్మెంట్ బకాయిలు చెల్లిస్తానని ప్రభుత్వం ప్రకటించినప్పటికి అది సరి అయింది కాదు.
6000 కోట్లతో బకాయిలు మొత్తం తీరవని, రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఉపాధ్యాయులు రెండు సంవత్సరాలుగా వేచి చూస్తున్న వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపడం లేదని, వారి సమస్యను ప్రభుత్వం పరిష్కరించడం లేదని, వారు నానా అవస్థలు పడుతున్నారని, ఇప్పటికే చాలామంది చనిపోయారని, ఇంకా చనిపోయి స్థితిలో ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే వారికి రావలసిన బకాయిలను 100 రోజుల్లో ఏక మొత్తంగా చెల్లించాలని నంగెడ్ల కనకదుర్గ, గడ్డం ముత్యం , ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






