calender_icon.png 12 June, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి

10-06-2025 11:50:55 PM

కోట్లతో ఎస్టీఎస్‌డీఎఫ్ నిధులతో విద్య, ఆరోగ్యం ఇతర పథకాలు అమలు..

భవన్‌లో గిరిజన, ఆదివాసీ ఎమ్మెల్యేల సమావేశంలో మంత్రి సీతక్క..

హైదరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రంలోని గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించిందని, ఆదిశగా నిధులను కేటాయిస్తూ ప్రజాప్రయోజన కార్యక్రమాలను చేపడుతోందని మంత్రి సీతక్క(Minister Seethakka) తెలిపారు. మంగళవారం మాసాబ్‌ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లో గిరిజన, ఆదివాసీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ రాంచంద్రునాయక్(Deputy Speaker Ramachandru Naik), ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, వెడ్మ బొజ్జు పటేల్, కోవ లక్ష్మీ, అనిల్ జాదవ్, ఆదినారాయణ, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, జీసీసీ చైర్మన్ కోట్నాక్ తిరుపతి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రూ. 12,600 కోట్లతో ఇందిర సౌరజల గిరి వికాసం, రూ.17,168 కోట్లతో ఎస్టీ ఎస్‌డీఎఫ్ నిధులతో గిరిజనుల విద్య, ఆరోగ్యం, వసతి, ఉపాధి, మౌలిక వసతుల కల్పన వంటి ప్రజాప్రయోజన పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామసభల అనుమతులు లేకుండా, పెసా చట్టాలను ఉల్లంఘిస్తు అటవీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, గ్రామసభ అనుమతి లేకుండా గిరిజన గ్రామాల్లో, పొలాల్లో అటవీశాఖ అధికారులు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలిపారు.

తడోబా టైగర్ రిజర్వ్,  కవ్వాల్ టైగర్ రిజర్వు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కొమురం భీం కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటిస్తూ తెచ్చిన జీవో నెం.49ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే దక్కేలాగా జీవో నెం.3ను పునరుద్ధరించాలన్న ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. భద్రాచలంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ మ్యూజియం తరహాలోనే ఇతర ఐటీడీఏలో మ్యూజియంలను, లైబ్రరీలను ఏర్పాటు చేయాలన్నారు.

త్వరలో మహబూబాబాద్, ఆసిఫాబాద్‌లలో జాబ్‌మేళాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఐటీడీఏ పరిధిలో ఉన్న 26 శాఖలను తిరిగి ఐటీడీఏ గొడుగు కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి సీతక్క సంక్షేమ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రైబల్ కేఫ్ ప్రారంభించి, ట్రైబల్ దేవాలయాలను దర్శించుకున్నారు. గిరిజన ఆహారశాల పేరుతో స్టాల్‌ను ఏర్పాటు చేసినట్లు సీతక్క తెలిపారు. అలాగే కొమురం భీమ్ డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శనను మంత్రి సీతక్క వీక్షించారు.