15-06-2025 06:44:46 PM
అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఎ.ఐ.యు.కెఎస్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కెచ్చల రంగారెడ్డి..
హనుమకొండ (విజయక్రాంతి): దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతూ, రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని అఖిల భారత ఐక్య రైతు సంఘం(All India United Farmers Association) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కెచ్చల రంగారెడ్డి(Kecchala Ranga Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేట డివిజన్ కేంద్రంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్) వరంగల్ జిల్లా ప్రధమ మహాసభ సందర్భంగా వరంగల్ రోడ్డు నుండి ఐఎంఏ హాల్ వరకు రైతు కూలీలు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు మైదం పాణి అధ్యక్షతన కామ్రేడ్ భోగా శ్రీరాములు (మాధవన్న) నగర్, ఐఎంఏ హాల్ లో మహాసభ జరిగింది. సభ ప్రారంభానికి ముందు మైదం పాణి జెండా ఆవిష్కరణ చేయగా, జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్ర సూరి రైతాంగ అమరవీరులను స్మరిస్తూ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టాగ మహాసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కెచ్చల రంగారెడ్డి ప్రారంభో ఉపన్యాసం చేస్తూ దేశంలో పాలకులు కార్పొరేట్, పెట్టుబడిదారుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి వ్యవసాయ రంగంలో రైతు వ్యతిరేక సంస్కరణలు తీసుకువస్తున్నారని మండిపడ్డారు.
ఎ.ఐ.యు.కె.ఎస్. తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి చంద్రన్న మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశానికి రైతులు వెన్నుముక అంటూనే వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. ప్రభుత్వాలకు రైతుల పట్ల, వ్యవసాయ రంగ అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న వ్యవసాయ రంగంలో ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్ సూచించిన సిఫారస్ లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు.వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.నరసింహ రావు, జిల్లా అధ్యక్షులు అలువాల నరేష్, ఆయుర్వేద డాక్టర్ కృష్ణారావులు మహాసభ ప్రతినిధులకు సందేశం ఇచ్చారు. అనంతరం 11 మందితో అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఎ.ఐ.యు.కె.ఎస్) వరంగల్ జిల్లా కార్యవర్గాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. అధ్యక్షులు అర్షం సుధాకర్, ఉపాధ్యక్షులు మైదం పాణి, కోళ్ల రాజు, సహాయ కార్యదర్శిలుగా గట్టి కొప్పుల రవి, కత్తుల కొమురయ్య, కోశాధికారిగా ధార లింగన్న, జిల్లా కమిటీ సభ్యులుగా మల్లేష్ లను ప్రకటించింది. అనంతరం మహాసభలో పలు తీర్మానాలను ఆమోదించింది.