కాంగ్రెస్ పేదల పక్షం
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, మే 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ నిరంతరం పేద ప్రజల పక్షాన నిలుస్తుందని, బీజేపీ ఎల్లప్పుడు కార్పొరేట్లకు అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో ఆయన గురువారం కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ సంక్షేమ పథకాల్లో విఫలమైందని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచి ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని స్పష్టంచేశారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని రైతు భరోసా ఇస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్లు ఈసీకి ఫిర్యాదు చేసి నిలిపివేశారని మండిపడ్డారు. గత పదేళ్లలో కేసీఆర్కు ప్రజలు గుర్తుకు రాలేదని, అధికారం పోయాకనే గుర్తుకువస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ రాజన్నగుడికి రూ.100 కోట్లు ఇస్తామని మోసం చేశారని విమర్శించారు. మోదీ రాజన్న ఆలయానికి వచ్చి ఉట్టి చేతులతో వెళ్లాడని విమర్శించారు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు.






