13-10-2025 12:47:37 AM
మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ
బెజ్జంకి అక్టోబర్ 12: ప్రభుత్వం ఏర్పాటు చేగసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినిగం చేసుకోవాలని, రైతులకు మద్దతు ధర అందించడంతోపాటు ధాన్యం అమ్మకంలో ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రభుత్వం ముమ్మర చర్యలు తీసుకుంటున్నదని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.
ఆదివారం బెజ్జంకి మండలంలోని రేగులపల్లి, గుగ్గిళ్ల, గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలను విరివిగా ఏర్పాటు చేస్తున్నదని పేర్కొన్నారు. గతంలో కంటే ఎక్కువగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు.
గత సీజన్లో కంటే ప్రస్తుత యేడాది మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందన్నారు.ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,389కి తోడుగా క్వింటాలుకు రూ.500 బోనస్, సాధారణ బీ గ్రేడ్ రకానికి రూ. 2,369 మద్దతు ధర నిర్ణయించిందన్నారు. గత యేడాది కంటే ఈసారి అదనంగా మద్దతు ధర పెరిగిందని చెప్పారు. రైతులు ధాన్యం బాగా ఆరబోసి కేంద్రాలకు తీసుకొస్తే తూకం వేయడంలో ఇబ్బందులు ఉండవని, కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి కోరారు.
రైతులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని తీసుకు వచ్చి కనీస మద్దతు ధరను పొందాలన్నారు.17 శాతం కంటే తక్కువ తేమ ఉండే విధంగా రైతులు చూసుకోవాలని ఆయన సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆయన సూచించారు.
అడిషనల్ డీఆర్డీఓ సుధీర్, బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, ఏపీఏమ్ పర్షరాములు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు గూడెల్లి శ్రీకాంత్, బైర సంతోష్,లింగం, చెప్యాల శ్రీనివాస్, సాదిక్ పాల్గొన్నారు.